Begin typing your search above and press return to search.

మొన్న సందీప్ కిషన్,ఇప్పుడు 'ఉప్పెన' హీరో

By:  Tupaki Desk   |   18 May 2021 11:30 AM GMT
మొన్న సందీప్ కిషన్,ఇప్పుడు ఉప్పెన హీరో
X
మనకు క్రీడా నేపధ్య చిత్రాలు బాగా తక్కువ. ఒకటీ అరా వచ్చినా అవి క్రికెట్ చుట్టూ తిరుగుతూంటాయి. అయితే వాటిని బ్రేక్ చేస్తూ తెలుగు చిత్రసీమలో హాకీ స్పోర్ట్స్ నేపథ్యంతో వచ్చింది ఏ1 ఎక్స్ ప్రెస్. సందీప్ కిషన్ హాకీ క్రీడాకారుడిగా తెరకెక్కిన ఈ సినిమా హాకీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన తొలి సినిమా . డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌యిన ఈ మూవీలో లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా యావరేజ్ అనిపించుకుంది. ఇప్పుడు అదే హాకీ నేపధ్యంలో మరో చిత్రం రూపొందబోతున్నట్లు సమాచారం.

ఉప్పెన చిత్రంతో అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకున్న వైష్ణవ తేజ్ ఈ సినిమా చేస్తున్నారు. న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ ద్వారా పృధ్వి అనే కుర్రాడు డైరక్టర్ గా పరిచయం కాబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ పై నాగార్జున నిర్మాతగా నిర్మించే ఈ చిత్రం చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇందులో హాకీ ప్లేయర్ గా కనిపించనున్నాడట వైష్ణవ్. దీనికోసం ఇప్పటికే ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడట. త్వరలోనే ఈ చిత్రానికి సంభందించి ప్రకటన వచ్చే అవకాసం ఉంది.

ఇక ఉప్పెన సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న వైష్ణవి తేజ్ కెరీర్ లో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కాకముందే క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాను స్టార్ట్ చేశాడు వైష్ణవ్. కొండపొలం నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. విఎఫ్ ఎక్స్ వర్క్ బాలెన్స్ ఉండటంతో రిలీజ్ పెండింగ్ పెట్టారు.

ఇదిలా ఉండగా మరో సినిమాని కూడా వైష్ణవ్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ దర్శకుడు గిరీశాయ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.