Begin typing your search above and press return to search.

ఉయ్యాలవాడ వారసులకు రాయల్టీ ఇవ్వాలా??

By:  Tupaki Desk   |   28 Sep 2019 5:20 AM GMT
ఉయ్యాలవాడ వారసులకు రాయల్టీ ఇవ్వాలా??
X
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. అయితే అన్ని భారీ సినిమాల రిలీజుకు ముందు ఏవో కొన్ని అవాంతరాలు ఎదురవడం సాధారణమే. అలాగే ఈ సినిమాకు కూడా కథ విషయంలోనూ.. సెన్సారింగ్ విషయంలోనూ కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి.

ఈ సినిమాను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కించారు కాబట్టి ఆయన వారసులకు రాయల్టీ చెల్లించాలని కోర్టులో దొరవారి దస్తగిరి రెడ్డి... మరో నలుగురు కోర్టులు క్సేసు వేయడం జరిగింది. నరసింహారెడ్డి వారసులకు రూ.20 కోట్లు రాయల్టీ చెల్లించేలా 'సైరా' నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్నారని.. అయితే ఆ ఒప్పందం ప్రకారం రాయల్టీ చెల్లించలేదు కాబట్టి సినిమా విడుదలను నిలిపివేయాలని కోర్టువారిని కోరారు. ఈ వాదనలను విన్న హైకోర్టు వారు ఇది సివిల్ ఒప్పందమని ఈ విషయంపై సివిల్ కోర్టుకు వెళ్ళాలని సూచించారు. ఈ సినిమా విడుదలను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వడానికి కోర్టువారు నిరాకరించారు. 'సైరా' విడుదలకు ముందే ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులకు చూపాలన్న వాదనను కూడా జడ్జి తోసిపుచ్చారు.

నరసింహారెడ్డి కుటుంబ సభ్యుల వాదన ఒకరకంగా ఉంటే 'సైరా' నిర్మాతల తరపువారి వెర్షన్ మరో రకంగా ఉంది. ఫ్రీడమ్ ఫైటర్లు..ఇతర నాయకుల జీవిత కథలపై 100 ఏళ్ళ తర్వాత ఎవరికీ రైట్స్ ఉండవని అంటున్నారు. ఈలెక్కన 'సైరా' చిత్ర కథ కోసం నరసింహారెడ్డి కుటుంబీకులకు ఎలాంటి పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇప్పుడు కొందరికి రాయల్టీ ఇస్తే రేపు వారసులమంటూ వేరే వ్యక్తులు వస్తే ఏం చేయాలనేది కూడా మెగా ఫ్యామిలీ సన్నిహితుల వాదనగా ఉంది. మరోవైపు సురేందర్ రెడ్డి ఈ సినిమా బయోపిక్ కాదని కూడా తేల్చేయడంతో నరసింహారెడ్డి వారసులకు రాయల్టీ ఇవ్వడానికి 'సైరా' టీమ్ సిద్ధంగా లేరనే విషయం స్పష్టమవుతోంది. కోర్టువారు కూడా 'సైరా' టీమ్ కు అనుకూలంగా తీర్పు ఇస్తారనే అభిప్రాయాలు ఉన్నాయి.

అయితే ఈ విషయంపై ఉయ్యాలవాడ గ్రామం.. ఆ పరిసర ప్రాంతాల్లో.. రాయలసీమలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరేమో ఉయ్యాలవాడ వారసులకు రాయల్టీ ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఆ డబ్బుతో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే అది నరసింహారెడ్డిగారికి ఘనమైన నివాళి అందించినట్టుగా ఉంటుందని వాదిస్తున్నారు. అయితే మెజారిటీ ప్రజలు మాత్రం చట్టపరంగా నరసింహారెడ్డి కుటుంబీకులకు ఇవ్వాల్సిన అవసరం లేకపోవచ్చేమో కానీ నైతికంగా వారికి రాయల్టీ ఇవ్వలైన బాధ్యత 'సైరా' టీమ్ పై ఉంటుందని అంటున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో భారీ కమర్షియల్ వెంచర్ టేకప్ చేసి..ఇప్పుడు ఆ కథకు ఉయ్యాలవాడ వారి కుటుంబ సభ్యులకు సంబంధం లేదన్నట్టు చేతులు దులుపుకోవడం సరికాదని అలా చేయడం సరికాదని వారి వాదన.