Begin typing your search above and press return to search.

శర్వా ధైర్యాన్ని మెచ్చుకొని తీరాల్సిందే..!

By:  Tupaki Desk   |   7 Sep 2022 6:30 AM GMT
శర్వా ధైర్యాన్ని మెచ్చుకొని తీరాల్సిందే..!
X
వర్సటైల్ హీరో శర్వానంద్ గత కొంతకాలంగా వరుస ప్లాపుల్లో ఉన్నాడు. 'పడి పడి లేచే మనసు' 'రణరంగం' 'జాను' 'శ్రీకారం' 'మహాసముద్రం' 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. దీంతో ఇప్పుడు ''ఒకే ఒక జీవితం'' సినిమాపైనే బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు.

శర్వా కెరీర్ లో మైలురాయి 30వ చిత్రం 'ఒకే ఒక జీవితం'. తెలుగు తమిళ భాషల్లో శ్రీ కార్తిక్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు - ఎస్.ఆర్ ప్రభు ఈ సినిమాని నిర్మించారు. ఇందులో అమల అక్కినేని - రీతూ వర్మ - వెన్నెల కిషోర్ - ప్రియదర్శి - నాజర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

ఇది టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తీసిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. గతంలో యాక్షన్ ప్రధానంగా సాగే అనేక సైన్స్ ఫిక్షన్ సినిమాలు వచ్చాయి కానీ.. ఇందులో తల్లీ కొడుకుల బాండింగ్ ను ఎమోషన్ ను ప్రధానంగా చూపించడం దీని ప్రత్యేకత. ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది.

'ఒకే ఒక జీవితం' సినిమాని సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల చేయనున్నారు. అయితే మేకర్స్ రిలీజ్ కు ముందుగానే సెలబ్రిటీ షో వేశారు. యూఎస్ఏ ప్రీమియర్ షోలకే సినిమా రిజల్ట్ డిసైడ్ పోతున్న రోజుల్లో.. ఎవరూ పెద్దగా స్పెషల్ ప్రీమియర్లు వేయడం లేదు. భారీ క్రేజ్ - బజ్ వుంటే ఒకటీ అర సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేస్తున్నారు.

అయితే ఇప్పుడు మూడు రోజుల ముందుగానే 'ఒకే ఒక జీవితం' సినిమాని వేయడం విశేషం. నిన్న మంగళవారం రాత్రి ఎఎంబీ సినిమాస్ లో స్పెషల్ సెలబ్రిటీ ప్రీమియర్ షో ప్రదర్శించారు. దీనికి అక్కినేని నాగార్జున - అమల - అఖిల్ లతో పాటుగా ప్రెజెంట్ టాలీవుడ్ లో ఉన్న యంగ్ డైరెక్టర్స్ అంతా హాజ‌రయ్యారు.

ప్రీ రిలీజ్ సెలబ్రిటీ టాక్ అనేది సినిమాకు బజ్ తీసుకురావడానికి హెల్ప్ అవుతుందని చెప్పాలి. కానీ టాక్ కొంచం అటు ఇటు అయితే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటికైతే సినిమా కాన్సెప్ట్ బాగుందనే ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. అలానే సెకండాఫ్ చాలా బాగా వచ్చినట్లు చెప్పుకుంటున్నారు.

ఏదేమైనా సినిమా కంటెంట్ మీద నమ్మకంతో మూడు రోజుల ముందుగానే స్పెషల్ ప్రీమియర్ షో వేసిన 'ఒకే ఒక జీవితం' టీమ్ మరియు శర్వానంద్ ధైర్యాన్ని మెచ్చుకొని తీరాల్సిందే. నిజానికి మేకర్స్ మొదటి నుంచీ కూడా ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ఐదేళ్ల క్రితమే ఈ సినిమా పనులు మొదలయ్యాయి. మధ్యలో రెండేళ్లు కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ నిర్మాతలు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఓటీటీకి వెళ్లకుండా.. కచ్చితంగా థియేటర్లలోనే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. వీఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం ఎక్కువ సమయం కేటాయించారు.. దానికి తగ్గట్టుగానే ఖర్చు చేశారు.

అయితే పాండమిక్ తర్వాత ఇబ్బడిముబ్బడిగా సినిమాలు రిలీజ్ అవడంతో.. 'ఒకే ఒక జీవితం' కోసం సరైన డేట్ దొరికే వరకూ వేచి చూసారు. అన్నీ అనుకూలించడంతో ఈ నెల 9న థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రమోషన్స్ తో బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కంటెంట్ మీద నమ్మకంతో ధైర్యంగా ముందుకు వెళ్తున్న శర్వా అండ్ టీమ్ కి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.