Begin typing your search above and press return to search.

ఇంతకీ కింగ్ 100వ చిత్రాన్ని ఎవరి చేతిలో పెడుతున్నారు..?

By:  Tupaki Desk   |   12 July 2022 1:30 PM GMT
ఇంతకీ కింగ్ 100వ చిత్రాన్ని ఎవరి చేతిలో పెడుతున్నారు..?
X
కింగ్ అక్కినేని నాగార్జున ఆరు పదుల దాటిన వయస్సులోనూ కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తున్నారు. ఓవైపు తన ఇద్దరు కొడుకులు హీరోలుగా టాలీవుడ్ లో రాణిస్తుండగా.. మరోవైపు నాగ్ రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తుండటం విశేషం. గత 35 ఏళ్లుగా ఇండస్ట్రీకి సేవలు అందిస్తున్న సూపర్ సీనియర్ హీరో.. ఇప్పుడు తన మైలురాయి వందో చిత్రానికి చేరుకున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలోని సీనియర్ హీరోలలో చిరంజీవి - బాల‌కృష్ణ త‌ర్వాత నాగార్జున 100 సినిమాల మైలురాయికి చేరువ‌య్యారు. సినీ అభిమానులు సైతం ఈ ప్రాజెక్ట్ ప్రకటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఏ దర్శకుడి చేతిలో పెడతారనేది అందరిలో ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

నాగ్ వందో సినిమాపై చాలా కాలంగా టాలీవుడ్‌ లో అనేక వార్త‌లు వినిపిస్తున్నాయి. కింగ్ దీని కోసం కొంతమంది ఫిలిం మేకర్స్ తో చర్చలు జరుపుతున్నాడని టాక్ వచ్చింది. అందులో ఇప్పుడు ఇద్దరు దర్శకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

నాగార్జున తన మైల్ స్టోన్ సినిమాను రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేయాలనుకుంటున్నట్టుగా ఆ మధ్య పుకార్లు షికార్లు చేశాయి. గతంలో వీరి కాంబినేషన్‌ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. ఈ క్రమంలో మరోసారి కలుస్తారని చెప్పుకున్నారు.

అలానే నాగ్ నూరవ చిత్రాన్ని తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తారని ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవలే డైరెక్టర్ ఫైనల్ డ్రాఫ్ట్‌ ను వివరించగా నాగార్జున నుండి తుది ఆమోదం పొందారని అంటున్నారు. అంతేకాదు ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పుకుంటున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌ పై నాగార్జున స్వయంగా ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించనున్నారని తెలుస్తోంది. మోహన్ రాజా రెడీ చేసిన స్క్రిప్టులో అక్కినేని వారసుడు అఖిల్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.

మోహన్ రాజా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో 'గాడ్ ఫాదర్' మూవీ చేస్తున్నారు. దీని తర్వాత నాగార్జున సినిమాపై ఫోకస్ పెడతారని అంటున్నారు. ఇలా కింగ్ 100వ సినిమా దర్శకుడు అంటూ ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఎవరు ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని డైరెక్ట్ చేస్తారనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'ది ఘోస్ట్' సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. దసరాకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న బాలీవుడ్ చిత్రం 'బ్రహ్మాస్త్ర: పార్ట్-1' షూటింగ్‌ ను కూడా పూర్తి చేశాడు. ఇది సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుంది. వీటి తర్వాత నాగ్ తన తదుపరి ప్రాజెక్ట్‌ ను ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే దీని గురించి అనౌన్స్ మెంట్ వస్తుందేమో చూడాలి.