Begin typing your search above and press return to search.

అల్లు అరవింద్ చేస్తున్న దాంట్లో తప్పేముంది..!?

By:  Tupaki Desk   |   4 Nov 2022 11:30 AM GMT
అల్లు అరవింద్ చేస్తున్న దాంట్లో తప్పేముంది..!?
X
టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న అల్లు అరవింద్.. మంచి కంటెంట్ తో రూపొందిన ఇతర భాషల సినిమాలను డబ్బింగ్ చేసి తెలుగు ప్రేక్షకులను అందిస్తుంటారు. ఇటీవల కన్నడ సినిమా 'కాంతార' ను తెలుగులోకి తీసుకొచ్చారు. గీతా ఆర్ట్స్‌ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అదే పేరుతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్‌ లో సెన్సెషన్ క్రియేట్ చేసింది. 50 కోట్ల వసూళ్లు రాబట్టి.. 'కేజీఎఫ్ 2' తర్వాత అతిపెద్ద రెండో డబ్బింగ్ సినిమాగా నిలిచింది.

కమిషన్ బేసిస్ మీద 'కాంతారా' సినిమాను రిలీజ్ చేసిన అల్లు అరవింద్.. మంచి లాభాలను వెనకేసుకున్నారని తెలుస్తోంది. అయితే అగ్ర నిర్మాత ఇప్పుడు ''బేడియా'' అనే హిందీ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరుణ్‌ ధావన్‌ - కృతి సనన్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఇది. ఇండియన్ స్క్రీన్ మీద తొలి క్రీచర్ కామెడీ జానర్ మూవీగా పేర్కొనబడుతోంది.

అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన 'బేడియా' చిత్రాన్ని సౌత్ భాషల్లోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. తెలుగులోకి "తోడేలు" అనే పేరుతో తీసుకురానున్నట్లు తెలిపిన మేకర్స్.. టైటిల్ పోస్టర్ మరియు ట్రైలర్ ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే నవంబర్ 25న 2డీ- 3డీ ఫార్మాట్ లలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసిన ఈ సినిమాని.. తెలుగులో అల్లు అరవింద్‌ - బన్నీ వాస్ లకు చెందిన గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ వారు రిలీజ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం 'తోడేలు' తెలుగు డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌ తో యాక్షన్ ప్లస్ కామెడీ ప్రధానంగా సాగే సిమిమా కాబట్టి.. టాలీవుడ్ లో కూడా మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని అందరూ భావిస్తున్నారు. 'కాంతారా' తో హిట్టు కొట్టిన అల్లు అరవింద్.. 'బేడియా' డబ్బింగ్ చిత్రంతోనూ లాభాలు వెనకేసుకుంటారని అనుకుంటున్నారు. అయితే అగ్ర నిర్మాత ఇలా డబ్బింగ్ కంటెంట్ ని తెలుగులోకి తీసుకురావడం సరైనదేనా? అని సోషల్ మీడియాలో ఓ వర్గం ఫ్యాన్స్ డిస్కషన్ మొదలుపెట్టారు.

టాలీవుడ్ లో ఎప్పటి నుంచో డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్న గీతా ఆర్ట్స్ రిలీజ్ చేసే సినిమా అంటే మినిమమ్ థియేటర్లు ఉంటాయి. అల్లు అరవింద్ నుంచి వస్తున్న డబ్బింగ్ చిత్రం అంటే స్ట్రెయిట్ తెలుగు మూవీ కంటే క్రేజ్ ఉంటుంది. ఈ డబ్బింగ్ చిత్రాలు నిర్మాతకు లాభాలు తెచ్చిపెడుతుందా లేదా అనేది అటుంచితే.. తెలుగులో వచ్చే చిన్న మీడియం చిత్రాలపై దెబ్బేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల వచ్చిన 'కాంతారా' సినిమాని దీనికి ఉదాహరణగా చూపిస్తున్నారు. పరోక్షంగా డబ్బింగ్ చిత్రాల వల్ల సొంత మార్కెట్ దెబ్బతింటోందని వాదిస్తున్నారు.

అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే.. అవి మనకు డబ్బింగ్ సినిమాలు అయినప్పుడు.. అక్కడ రిలీజ్ అయ్యే తెలుగు చిత్రాలు వాళ్ళకి డబ్బింగ్ కంటెంటే కదా. 'బాహుబలి' 1&2 సినిమాలు -RRR - 'పుష్ప' - కార్తికేయ 2' వంటి సినిమాలు ఇతర భాషల్లో డబ్ కాబడి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. మన సినిమాలను పాన్ ఇండియా రిలీజ్ చేసినప్పుడు అక్కడ కూడా డబ్బింగ్ చిత్రాల గురించి ఇలానే అనుకుంటే పరిస్థితి ఏంటి? మనం ఇతర భాషల మార్కెట్‌ మీద దృష్టి పెట్టినట్లుగానే.. వాళ్ళు కూడా మన మార్కెట్ ని క్యాష్‌ చేసుకోవాలని అనుకోవడంలో తప్పేముంది?

తెలుగు చిత్రాలను అక్కడి నిర్మాతలు డబ్బింగ్ చేసి రిలీజ్ చేసినట్లుగానే.. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కూడా ఇతర భాషల్లోని మంచి కంటెంట్ ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని భావిస్తారు. అందులో అల్లు అరవింద్ లేదా మరొక నిర్మాతనో తప్పుబట్టడం కరెక్ట్ కాదు. నిజానికి పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలైన తర్వాత భాషా తారతమ్యాలు.. ప్రాంతీయ బేధాలు తొలగిపోయాయి. అక్కడి సినిమాలు ఇక్కడికి.. ఇక్కడి చిత్రాలు అక్కడికి వెళ్తున్నాయి. మంచి సినిమా అనిపిస్తే అన్ని భాషల ప్రేక్షకులూ ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగాలేకపోతే రిజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మంచి డబ్బింగ్ సినిమాకి మన పర భాషా బేధాలు వెతుక్కోవడం సరైంది కాదేమో?



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.