Begin typing your search above and press return to search.

'ది వారియర్' తో మరోసారి విశ్వరూపం చూపించిన విలక్షణ నటుడు..!

By:  Tupaki Desk   |   16 July 2022 6:36 AM GMT
ది వారియర్ తో మరోసారి విశ్వరూపం చూపించిన విలక్షణ నటుడు..!
X
సీనియర్ దర్శకుడు రవి రాజా పినిశెట్టి తనయుడు ఆది పిన్నిశెట్టి 'ఒక విచిత్రం' సినిమాతో వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. 'మృగం' చిత్రంతో తమిళ్ లో ఎంట్రీ ఇచ్చిన టాలెంటెడ్ హీరో.. రెండు భాషల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కేవలం హీరోగా మాత్రమే చేయకుండా మంచి పాత్ర వచ్చినప్పుడు విలన్ గా సపోర్టింగ్ రోల్స్ చేయడానికి కూడా ఆది వెనకాడలేదు.

'మలుపు' చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న ఆది.. ‘సరైనోడు’ మూవీలో తొలిసారిగా ప్రతినాయకుడిగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ‘అజ్ఞాతవాసి’ సినిమాలో స్టైలిష్ విలన్ గా కనిపించాడు. 'రంగస్థలం' లో హీరో అన్నగా అద్భుతమైన నటన కనబరిచాడు. అలానే 'నిన్నుకోరి' 'నీవెవరో' 'యూ టర్న్' వంటి సినిమాలతో మెప్పించిన ఆది.. హీరో క‌మ్ విలన్ గా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు.

అయితే ఇటీవల కాలంలో ఆది పిన్నిశెట్టి సరైన హిట్ అందుకోలేదు. 'గుడ్ లక్ సఖి' సినిమా నిరాశ పరచగా.. 'క్లాప్' మూవీ ఓ వర్గం ఓటీటీ ఆడియన్స్ కు మాత్రమే పరిమితమైంది. ఈ నేపథ్యంలో మరోసారి విలన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'ది వారియర్' చిత్రంలో గురు అనే పాత్రలో నటించాడు.

ఎనర్జెటిక్ సహీరో ఉస్తాద్ రామ్ పోతినేని మరియు కృతి శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “ది వారియర్”. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గురువారం థియేటర్లలో రిలీజ్ అయింది. తొలి రోజే మిశ్రమ స్పందన అందుకున్న ఈ మూవీ.. టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ళు రాబడుతోంది.

ఇందులో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా రామ్ పెర్ఫామెన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అలానే విలన్ గా చేసిన ఆది పిన్నిశెట్టి కి హీరోతో సమానంగా ప్రశంసలు దక్కుతున్నాయి. క్రూరమైన గురు పాత్రలో అతను అద్భుతంగా నటించాడని ప్రేక్షకులు కొనియాడుతున్నారు. ఆది మాస్ గెటప్ మరియు మేనరిజం అలరిస్తోంది. చాలా కాలం తర్వాత ఆది ఓ రేంజ్ లో నటించాడని అంటున్నారు.

సినిమాలో ప్రతినాయకుడి పాత్ర ఎంత బలంగా ఉంటే హీరో క్యారక్టర్ అంత ఎలివేట్ అవుతుందని అంటుంటారు. ఇప్పుడు 'ది వారియర్' చిత్రంలో రామ్ పాత్ర బాగా పండటానికి ఆది పిన్నిశెట్టి రోల్ కూడా కారణమని చెబుతున్నారు. క్లైమాక్స్ లో రామ్ - ఆది నువ్వా నేనా అంటూ పోరాడే సన్నివేశం ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇకపోతే ఆది పిన్నిశెట్టి తన భార్య నిక్కీ గల్రానితో కలిసి నటించిన 'శివుడు' సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ప్రస్తుతం తెలుగు తమిళంలో హీరోగా మూడు ద్విభాషా చిత్రాలు చేస్తున్నాడు. మంచి పాత్ర దొరికితే విలన్ గానూ మరిన్ని సినిమాలు చేయడానికి రెడీ అంటున్నాడు ఆది.