Begin typing your search above and press return to search.

‘ఆచార్య’ షూటింగ్‌కు అనుకోని బ్రేక్

By:  Tupaki Desk   |   10 March 2021 3:37 AM GMT
‘ఆచార్య’ షూటింగ్‌కు అనుకోని బ్రేక్
X
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘ఆచార్య’ విడుదలకు ఇంకో రెండు నెలల సమయమే ఉంది. కానీ ఇంకా షూటింగ్ ముగియలేదు. చివరి రెండు షెడ్యూల్స్ చేయాల్సి ఉంది. ఐతే ప్రస్తుతం చిత్రీకరిస్తున్నవి భారీ యాక్షన్‌తో ముడిపడ్డ సన్నివేశాలు కావడంతో నెమ్మదిగానే షూట్ నడుస్తోంది. సాధ్యమైనంత త్వరగా అవి ముగించాలనుకుంటున్న సమయంలో షూటింగ్‌కు అనుకోకుండా బ్రేక్ పడినట్లు సమాచారం. ఖమ్మంలో ఈ సినిమా షూటింగ్ నడుస్తుండగా.. అక్కడ ఉన్నట్లుండి ఉష్ణోగ్రతలు తీవ్రం కావడంతో మెగాస్టార్ బాగా ఇబ్బంది పడ్డారట. ఎండ వేడికి తట్టుకోలేక ఆయన డీహైడ్రేషన్‌కు గురైనట్లు తెలిసింది. దీంతో వెంటనే షూటింగ్ ఆపేశారట. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని, వాతావరణాన్ని బట్టి షూటింగ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

చిరు ఖమ్మంలో షూటింగ్‌లో ఉన్నాడనే ‘శ్రీకారం’ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఆ ప్రాంతంలోనే పెట్టారు. ఐతే విరామం లేకుండా షూటింగ్‌లో పాల్గొంటుండటం, వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో చిరు ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా ఓపెన్ ఏరియాలో ఎండలో చరణ్‌తో కలిసి చిరు చిత్రీకరణలో పాల్గొంటున్న ఫొటోలు కూడా కొన్ని బయటికి రావడం తెలిసిందే. ఆ ఫొటోలు చూస్తేనే ఎండ ఎక్కువగా ఉన్న సంగతి అర్థమవుతుంది. ఐతే వేసవి వచ్చిందంటే ఖమ్మంలో అంతకంతకూ ఉష్ణోగ్రతలు పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఈ నేపథ్యంలో చిరు అక్కడ షూట్ ఎలా పూర్తి చేస్తాడో చూడాలి. మే 13న ‘ఆచార్య’ విడుదల కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్ పాత్ర నిడివి అరగంటకు పైగానే ఉంటుందంటున్నారు. అతడి సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఆమె కూడా ఇటీవలే సెట్స్‌లోకి జాయిన్ అయింది. చిరుకు జోడీగా ఇందులో కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.