Begin typing your search above and press return to search.

స్టార్ హీరోల క్రేజీ ప్రాజెక్ట్స్ పై అనిశ్చితి నెలకొందా..?

By:  Tupaki Desk   |   6 Sep 2022 4:37 AM GMT
స్టార్ హీరోల క్రేజీ ప్రాజెక్ట్స్ పై అనిశ్చితి నెలకొందా..?
X
కరోనా పాండమిక్ టైంలో స్టార్స్ అంతా ఇంటికే పరిమితమైనా.. ఈ విరామం వారికి బాగానే కలిసొచ్చింది. కొత్త కథలు వినడానికి సరికొత్త కాంబినేషన్లు సెట్ చేసుకోడానికి ఉపయోగపడింది. ప్రతీ హీరో కూడా రెండు మూడు స్క్రిప్ట్స్ ని రెడీ చేసి పెట్టుకున్నారు. టాలీవుడ్ స్టార్స్ అందరూ రెండు మూడేళ్ళ వరకూ ఖాళీగా ఉండరని అనిపించింది. అయితే అధికారికంగా ప్రకటించిన ప్రాజెక్ట్స్ పై ఇప్పుడు అనిశ్చితి నెలకొందని తెలుస్తోంది.

దీంతో హీరోల లైనప్ లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అందరూ మారిన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథలు ఎంపిక చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. దీంతో ఏ సినిమా ఎప్పుడు ఉంటుందో చేప్పలేమనే.. అసలు ఉంటుందో లేదో తెలియడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి ఎన్నడూ లేనంత వేగంగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 'గాడ్ ఫాదర్' చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేస్తున్న చిరు.. 'భోళా శంకర్' మరియు 'వాల్తేరు వీరయ్య' సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఇదే క్రమంలో వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. అలానే మారుతి డైరెక్షన్ లో కూడా ఓ మూవీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు ఓ అర డజను కథలను సిద్ధంగా ఉంచుకున్నట్లు తెలిపారు.

అయితే 'ఆచార్య' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారిన తర్వాత చిరంజీవి ఆలోచనలో మార్పులు వచ్చాయని అంటున్నారు. కథల ఎంపికలో పునరాలోచలో పడ్డారని.. ప్రస్తుతం నటిస్తున్న మూడు సినిమాల ఫలితాలను బట్టే తదుపరి చిత్రాలపై దృష్టి సారించాలని మెగాస్టార్ నిర్ణయించుకున్నారని టాక్ వినిపిస్తోంది.

'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. దాన్ని కాపాడుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ను పక్కన పెట్టేస్తున్నారనే టాక్ వచ్చింది. బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప 2' చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సన్నద్ధం అవుతున్నారు. దీని తర్వాత స్టార్ హీరో చేసే సినిమా ఏంటనేది ఇంతవరకు తేలలేదు.

నిజానికి 'పుష్ప' కంటే ముందు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్: కనబడుటలేదు' అనే చిత్రాన్ని అనౌన్స్ చేశాడు అల్లు అర్జున్. 'పుష్ప' తర్వాత కొరటాల శివ తో ఓ మూవీ ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. అయితే మారిన పరిస్థితుల్లో ఈ రెండు ప్రాజెక్ట్స్ ను పూర్తిగా పక్కన పెట్టేసినట్లే అనే టాక్ నడుస్తోంది. బోయపాటి శ్రీను - మురగదాస్ వంటి దర్శకులు బన్నీ తో వర్క్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే దానిపై దసరా నాటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమా తర్వాతి మూడు ప్రాజెక్ట్స్ పై ఇది వరకే క్లారిటీ ఇచ్చాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వెంటనే 'జనగణమన' అనే పాన్ ఇండియా చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లిన వీడీ.. శివ నిర్వాణ తో 'ఖుషి' చిత్రాన్ని ప్రారంభించాడు. ఇదే క్రమంలో సుకుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది.

అయితే ఇప్పుడు 'లైగర్' భారీ డిజాస్టర్ గా మారడంతో విజయ్ లైనప్ లో మార్పులు కనిపించనున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా 'JGM' చిత్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేసారని వస్తున్నాయి. సుక్కూ సినిమా ఎప్పుడు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో 'ఖుషి' తర్వాత VD మరో మూవీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. దిల్ రాజు బ్యానర్ లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

పవర్ స్టార్ పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ కు సైన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికే రెండు చిత్రాలను రిలీజ్ చేయగా.. ప్రస్తుతం సెట్స్ మీదున్న 'హరి హర వీరమల్లు' సినిమాని ఎప్పుడు పూర్తి చేస్తారో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అలానే హరీష్ శంకర్ తో 'భవదీయుడు భగత్ సింగ్' మరియు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ మూవీకి అధికారిక ప్రకటన వచ్చింది.

అయితే ఇప్పుడు పవన్ ప్రాధాన్యతా క్రమం మారినట్లు తెలుస్తోంది. లైన్ లో ఇప్పుడు 'వినోదం సీతమ్' రీమేక్ ప్రాజెక్ట్ ముందుకు వచ్చినట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అఫీషియల్ లాంచ్ చేయాల్సిన ఈ సినిమా ఆలస్యమైంది. జనసేన అధినేత క్రియాశీలక రాజకీయాల్లో బిజీగా మారితే.. కమిటైన సినిమాలు ఎప్పుడు చేస్తారనేది తెలియడం లేదు. అసలు వీటిల్లో ఒకటీ రెండు ప్రాజెక్ట్స్ ఉంటాయో లేదో కూడా చెప్పలేమనే చర్చ జరుగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.