Begin typing your search above and press return to search.

'సాహో' ఫార్ములా స‌రికాదేమో డార్లింగ్?

By:  Tupaki Desk   |   10 Feb 2020 6:00 AM GMT
సాహో ఫార్ములా స‌రికాదేమో డార్లింగ్?
X
పాన్ ఇండియా మూవీ `సాహో` ఫ‌లితం ప్ర‌భాస్ అంచ‌నాల‌ను రీచ్ అవ్వ‌ని సంగ‌తి తెలిసిందే. భారీ కాన్వాస్ పై చిత్రాన్ని తెర‌కెక్కించిన ఈ చిత్రం ఉత్త‌రాదిన బ్లాక్ బ‌స్ట‌ర్ అయినా సౌత్ లో డీలా ప‌డిపోయింది. ఇక అదుపు త‌ప్పిన బ‌డ్జెట్ వ‌ల్ల యువి క్రియేష‌న్స్ కి చివ‌ర్లో చిక్కులు త‌ప్ప‌లేదు. అయితే సాహో ఫ‌లితం ఎలా ఉన్నా.. ఇప్పుడు ప్ర‌భాస్ 20 (రాధే శ్యాం) కోసం సాహో ఫార్ములానే అనుస‌రిస్తుండ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. అభిమానుల్లో ర‌క‌ ర‌కాల సందేహాల‌కు తాజా ఎంపిక‌లు తావిస్తున్నాయి.

అయితే బ‌డ్జెట్ ఖ‌ర్చు విష‌యం లో మాత్రం సాహో కోసం చేసిన త‌ప్పిదం చేయ‌ద‌ల్చుకోలేద‌ట‌. జాన్ బ‌డ్జెట్ విష‌యంలో యూవి క్రియేష‌న్స్ ముందుగానే జాగ్ర‌త్త ప‌డింది. భారీ కాస్టింగ్ విష‌యంలో ఎంత‌ మాత్రం వెన‌క‌డుగు వేయ‌లేదు. సాహో కోసం బాలీవుడ్ స్టార్ల‌ను బ‌రిలో దించిన‌ట్టే జాన్ కోసం యూనిట్ బాలీవుడ్ న‌టుల‌ను వ‌రుసగా ఎంపిక చేస్తోంది. ఇప్ప‌టికే బాలీవుడ్ సీనియ‌ర్ హీరో మిథున్ చ‌క్ర‌వ‌ర్తిని కీల‌క పాత్ర‌కు ఎంపిక చేసారు. అటుపై వెట‌ర‌న్ న‌టి భాగ్య శ్రీని మ‌రో కీల‌క పాత్ర‌కు తీసుకున్నారు.

తాజాగా మ‌రో బాలీవుడ్ న‌టుడు కునాల్ రాయ్ క‌పూర్ ను కూడా బ‌రిలోకి దించుతున్నార‌ని తెలుస్తోంది. కునాల్ తో ఓ ముఖ్య‌మైన పాత్ర కోసం సంప్ర‌దించార‌ట‌. ఇలా వ‌రుస పెట్టి బాలీవుడ్ న‌టుల‌ను రంగంలోకి దించ‌డంతో సినిమా బ‌డ్జెట్ అంత‌కంత‌కు పెరుగుతుంద‌న్న వాద‌నా వినిపిస్తుంది. సెట్ల ప‌రంగా.. అలాగే ఇతర ఖ‌ర్చ‌లు త‌గ్గించుకున్నా.. బాలీవుడ్ న‌టుల కాల్షీట్లు ఎక్కువ రోజులు తీసుకోవ‌డం తో సేవ్ చేస్తున్న అమౌంట్ ఇక్క‌డ ఖ‌ర్చు చేస్తున్న‌ట్టే అవుతోంది. టాలీవుడ్ నటుల‌ను కాద‌ని మ‌రీ ప‌దే ప‌దే బాలీవుడ్ తారల్ని దిగుమ‌తి చేయ‌డం పై తాజాగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. సాహో సినిమా ద‌క్షిణాది వారికి క‌నెక్ట్ కాక‌ పోవ‌డానికి మెజారిటీ పార్ట్... బాలీవుడ్ ముఖాలు క‌నిపించ‌డం కొంత‌ కార‌ణం. ఇప్పుడు సేమ్ ఫార్ములాని రిపీట్ చేయ‌డం స‌రైన‌దేనా? అన్న సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇది 1960 నాటి పీరియాడిక్ ల‌వ్ స్టోరీ. `జిల్` ఫేం రాధాకృష్ణ ఎంచుకున్న క‌థాంశం కాస్త కొత్త‌ద‌నంతో నిండిన‌దే. సాహో ద‌ర్శ‌కుడు సుజిత్ లానే రాధాకృష్ణ‌కు రెండో ప్ర‌య‌త్నం ఇది. సాహ‌సం.. ప్ర‌యాణం.. ఒక్క‌డున్నాడు లాంటి చిత్రాల‌కు సహ ర‌చ‌యిత‌గా ప‌నిచేశాడు కాబ‌ట్టి రైట‌ర్ గా మంచి ప్రావీణ్యం ఉంది. జిల్ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌ర్వాలేద‌నిపించాడు. మ‌రి ప్ర‌భాస్ 20ని అభిమానుల‌ అంచ‌నాల‌కు ధీటుగా తెర‌కెక్కిస్తున్నాడా? అన్నదానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం సినిమా సెట్స్ లో ఉంది. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హెగ్దే క‌థానాయిక‌ గా న‌టిస్తోంది. తెలుగు- హిందీ- త‌మిళ భాష‌ల్లో సినిమా రిలీజ్ కానుంది.