Begin typing your search above and press return to search.

షూటింగులు లేకుండా ఖాళీగా ఉన్న టాలీవుడ్ టాప్ హీరోలు..!

By:  Tupaki Desk   |   9 Jun 2022 3:30 AM GMT
షూటింగులు లేకుండా ఖాళీగా ఉన్న టాలీవుడ్ టాప్ హీరోలు..!
X
ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలందరి చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కరోనా పాండమిక్ తర్వాత ఇండస్ట్రీలో పరిస్థితులు నార్మల్ అవడంతో వరుసపెట్టి సినిమాలు సైన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే వారిలో నలుగురు స్టార్స్ తమ తదుపరి చిత్రాల షూటింగులను మొదలు పెట్టకుండా ఖాళీగా ఉన్నారు.

మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ - జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ - అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు ఇప్పటికే పలు చిత్రాలకు కమిట్ అయ్యారు. వీరిలో కొందరు తమ చివరి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించినప్పటికీ.. వెంటనే కొత్త ప్రాజెక్ట్స్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లకపోవడం గమనార్హం.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే 'సర్కారు వారి పాట' సినిమాతో సక్సెస్ అందుకున్నారు. ఈ నెలలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని అందరూ భావించారు. కానీ ఇప్పుడు జూలైలో మాత్రమే SSMB28 ని ప్రారంభిస్తారని తెలుస్తోంది. హాసిని అండ్ హారిక క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందనుంది.

'అరవింద సమేత' తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈమధ్యనే 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అయితే ఇంకా కొరటాల శివ దర్శకత్వంలో చేయాల్సిన NTR30 చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ ను ఆగస్టులో మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు.

RRR చిత్రంలో మరో హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ విజయాన్ని అందుకున్న వెంటనే 'ఆచార్య' తో డిజాస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేస్తున్న RC15 సెట్స్ మీద ఉంది. కొన్ని తెలియని కారణాల వల్ల, భోపాల్ షెడ్యూల్ ను రద్దు చేశారని టాక్. అయితే ఈ షెడ్యూల్ తిరిగి ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే దానిపై ఎలాంటి అప్డేట్ లేదు.

'పుష్ప: ది రైజ్' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఇంకా రెండో భాగం 'పుష్ప: ది రూల్' ను సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. మార్చి లోనే షూటింగ్ మొదలు పెడతామని మేకర్స్ ప్రకటించారు కానీ.. ప్రీ ప్రొడక్షన్ మరియ స్క్రిప్టు మీద ఎక్కువ ఫోకస్ పెట్టడంతో ఆలస్యం అవుతోంది. సుకుమార్ ఈ ప్రాజెక్ట్ ను ఆగస్టులో ప్రారంభిస్తారని టాక్ వినిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే పవన్ ఇతర ప్రణాళికల వల్ల క్రిష్ జాగర్లమూడి సినిమా డిలే అవుతూ వస్తోంది. అగ్ర హీరో మళ్లీ ఎప్పుడు సెట్స్ లో అడుగు పెడతారో చూడాలి. ఇక దీని తర్వాత ఓ తమిళ్ రీమేక్ తో పాటుగా 'భవదీయుడు భగత్ సింగ్' ను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.

ఇలా టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ ప్రస్తుతం షూటింగుల్లో నిమగ్నమై లేరు. ఇలా ఎప్పుడో కానీ జరగదు. అయితే వచ్చే నెల నుంచి ఒక్కరొక్కరుగా తిరిగి సెట్స్ లో అడుగుపెట్టి బిజీగా మారిపోనున్నారు.