Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌ రూ. 8 కోట్లు.. కోలీవుడ్‌ రూ. 2కోట్లు

By:  Tupaki Desk   |   6 April 2020 1:30 AM GMT
టాలీవుడ్‌ రూ. 8 కోట్లు.. కోలీవుడ్‌ రూ. 2కోట్లు
X
మహమ్మారి కరోనా సినిమా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపించింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో ఇండియాలో మూడు వారాల పాటు లాక్‌ డౌన్‌ ను ప్రకటించిన విషయం తెల్సిందే. లాక్‌ డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్‌ లు పూర్తిగా ఆగిపోయాయి. దాంతో షూటింగ్స్‌ లో పాల్గొనే రోజు వారి కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. కనీసం తిండి లేక అల్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో టాలీవుడ్‌ కు చెందిన ప్రముఖులు లక్షల్లో సాయంను ప్రకటించారు.

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ఇంకా నాగార్జునలు కోటి విరాళంను ప్రకటించగా ఇంకా పలువురు స్టార్స్‌ వారికి తోచినంత సాయంను ప్రకటించారు. ఇప్పటి వరకు సీసీసీ కి అందిన విరాళం దాదాపుగా 8 కోట్లు అంటూ సమాచారం అందుతోంది. ఆ మొత్తంను తిండిలేక అవస్థలు పడుతున్న సినీ కార్మికులకు అందించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. అయితే తమిళ సినీ పరిశ్రమలో మాత్రం సినీ కార్మికులను ఆదుకునేందుకు ప్రముఖులు ఎవరు కూడా ముందుకు రావడం లేదు.

తాజాగా ఈ విషయాన్ని స్వయంగా దక్షిణ భారత సినీ కార్మికుల సంఘం అధ్యక్షుడు ఆర్‌ కే సెల్వమణి చెప్పుకొచ్చారు. ఎంతో మంది ఉండి కూడా సాయం చేసేందుకు ముందుకు రావడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు దాదాపుగా రెండు కోట్ల వరకు విరాళాలు ఇంకా బియ్యం వచ్చినట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు.

తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ 50 లక్షల విరాళంను ప్రకటించాడు. తమిళ స్టార్స్‌ లో రజినీకాంత్‌ ఇచ్చిందే అత్యధిక మొత్తం. ముందు ముందు కూడా తమిళ స్టార్స్‌ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ లెక్కన చూస్తే తమిళ స్టార్స్‌ కంటే తెలుగు స్టార్స్‌ మనసున్న మంచి మహారాజులు అంటూ సోషల్‌ మీడియాలో తెలుగు నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.