Begin typing your search above and press return to search.

టాలీవుడ్ కు మళ్ళీ డ్రగ్స్ మరకలు అంటుకుంటున్నాయా..?

By:  Tupaki Desk   |   13 March 2021 6:38 AM GMT
టాలీవుడ్ కు మళ్ళీ డ్రగ్స్ మరకలు అంటుకుంటున్నాయా..?
X
సినీ ఇండస్ట్రీని డ్రగ్స్‌ వ్యవహారం ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మాదక ద్రవ్యాలకు సంబంధించిన న్యూస్ వచ్చిందంటే.. ఫలానా సెలబ్రిటీకి దీనితో లింకులున్నాయనే వార్తలు వినిపిస్తుంటాయి. బాలీవుడ్ మొదలుకొని శాండిల్ వుడ్ - టాలీవుడ్ వరకు దాదాపు ప్రతి ఇండస్ట్రీలోనూ డ్రగ్స్ రాకెట్ అనేది ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది. ఇటీవల బాలీవుడ్ - శాండిల్ వుడ్ లలో డ్రగ్స్ ఇష్యూ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తీగ లాగితే డొంక కదిలినట్లు రోజుకో మలుపు తిరుగుతూ వచ్చింది. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు.. శాండిల్ వుడ్ లో బెంగళూరు సిటీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు విచారణ చేపట్టి అనేక మందిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఎన్సీబీ అధికారులు ఓ టాలీవుడ్ నటిని కూడా అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

అయితే కన్నడ సీమలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో తాజాగా టాలీవుడ్ యువ హీరోకి బెంగుళూరు పోలీసులు నోటీసులు జారీ చేయడం మళ్ళీ కలకలం రేపుతోంది. బెంగళూరు బాన్సువాడి పోలీసులు.. యువ హీరో - ఓ నిర్మాత మరియు ప్రముఖ వ్యాపారవేత్త సహా ఐదుగురికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇంతకు ముందు టాలీవుడ్ లో 2017లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులోనూ అనేక మంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

అప్పుడు టాలీవుడ్ ప్రముఖులు చాలామంది తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిట్ అధికారుల విచారణకు హాజరై వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఆ కేసులో మొదట్లో బాగా హడావిడి జరిగినా ఎందుకో ఎవరినీ అరెస్ట్ చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ ఈ కేసు గురించి వివరాలేవీ తెలియలేదు. అయితే ఇప్పుడు మరోసారి డ్రగ్స్ కేసులో యువ హీరో పేరు బయటకు రావడం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో కర్ణాటక పోలీసులు మరికొందరు టాలీవుడ్ ప్రముఖులక నోటీసులు జారీ చేస్తారని టాక్ నడుస్తోంది. మొత్తానికి శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసు మెల్లిగా టాలీవుడ్‌ కు అంటుకునే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలను వ్యక్తమవుతున్నాయి.