Begin typing your search above and press return to search.

రీమేకులకు స్వస్తి పలకాల్సిన టైమొచ్చిందా..?

By:  Tupaki Desk   |   16 Nov 2022 12:30 AM GMT
రీమేకులకు స్వస్తి పలకాల్సిన టైమొచ్చిందా..?
X
టాలీవుడ్ కు రీమేక్స్ అనేవి కొత్తేమీ కాదు. పాత తరం కథానాయకుల నుంచి నేటి యువతరం హీరోల వరకూ అందరూ రీమేక్ చిత్రాల్లో నటించారు. ఆల్రెడీ హిట్టైన కంటెంట్ కాబట్టి సేఫ్ జోన్ లో ఉండొచ్చని భావించి రీమేక్ చేసేవారు కొందరైతే.. సరికొత్త కంటెంట్ ని తెలుగు ప్రేక్షకులకు అందించి సక్సెస్ అవ్వాలని ఆలోచించేవారు మరికొందరు ఉన్నారు. అయితే ఒకప్పటిలా ఇప్పుడు రీమేక్ చిత్రాలు పెద్దగా విజయం సాధించడం లేదనిపిస్తోంది. ఇటీవల వచ్చిన కొన్ని రీమేక్ సినిమాలను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

'అయ్యప్పనమ్ కోశియుమ్' రీమేక్ గా పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకోపోయింది. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవడంలో విఫలం అయింది. గతేడాది పవన్ 'వకీల్ సాబ్' పరిస్థితి కూడా అంతే. ఇక 'లూసిఫర్' చిత్రానికి రీమేక్ గా మెగాస్టార్ చిరంజీవి చేసిన 'గాడ్ ఫాదర్' సినిమాకి కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. పాజిటిక్ టాక్ వచ్చినప్పటికీ.. వసూళ్ల వేటలో వెనుకబడిపోయింది.

అలానే హిందీలో 'గద్దలకొండ గణేష్' రీమేక్ గా అక్షయ్ కుమార్ రూపొందిన 'బచ్చన్ పాండే'.. షాహిద్ కపూర్ చేసిన 'జెర్సీ' రీమేక్.. హృతిక్ రోషన్ మరియు సైఫ్ అలీఖాన్ కలిసి నటించిన 'విక్రమ్ వేదా' రీమేక్.. 'ఫారెస్ట్ గంప్' రీమేక్ గా తెరకెక్కిన 'లాల్ సింగ్ చద్దా' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. తెలుగులో ఇటీవల వచ్చిన 'ఓరి దేవుడా!' మరియు 'ఊర్వశివో రాక్షసివో' వంటి చిత్రాలు మంచి టాక్ తెచ్చుకుని కూడా కలెక్షన్స్ రాబట్టలేకపోయాయి.

ఇలా ఈ ఏడాదిలో అనేక రీమేక్ సినిమాలు ఫెయిల్యూర్స్ గా మిగిలాయి. ఓటీటీలో వైవిధ్యమైన కంటెంట్ ను చూడటానికి అలవాటు పడిపోయిన జనాలు.. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రూపొందుతున్న చిత్రాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. అందుకే ఆల్రెడీ చూసేసిన కంటెంట్ ని వినోదం కోసం మళ్ళీ థియేటర్ కు వచ్చి సమయం మరియు డబ్బు వెచ్చించే పరిస్థితి లేదని అందరూ గ్రహించాలి.

చిన్న హీరోలు మరియు తక్కువ బడ్జెట్‌ తో తీసిన రీమేక్ చిత్రాలు పని చేయవచ్చు కానీ.. వందల కోట్లు బడ్జెట్ పెట్టి స్టార్ హీరోలు చేసే రీమేక్స్ వర్కౌట్ అవ్వడం లేదని ఇటీవలి సినిమాలు చూస్తే అర్థమవుతుంది. ఓటీటీల హవా స్టార్ట్ అయిన తర్వాత రీమేకుల యుగం ముగిసిపోయిందని చెప్పాలి. ప్రేక్షకులు ఒరిజినల్ కంటెంట్ ని ఉత్తేజకరమైన చిత్రాలను చూడటానికి మాత్రమే థియేటర్లకు వస్తున్నారు.

ఈ విషయాన్ని పసిగట్టిన తమిళ కన్నడ మలయాళ హీరోలు రీమేకులను తగ్గించేశారు. ఫ్రెష్ కంటెంట్ తో సినిమాలు తీస్తూ.. ఇతర భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ విధంగా సక్సెస్ అవుతున్నారు. కానీ తెలుగు - హిందీ చిత్ర పరిశ్రమలు మాత్రం ఇంకా రీమేకులనే నమ్ముకొని ముందుకు వెళ్తున్నారు. అయితే ఇటీవలి 'లాల్ సింగ్ చద్దా' ప్లాప్ తరవాత బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్.. మరో రీమేక్ ప్రాజెక్ట్ ని విరమించుకున్నాడని తెలుస్తోంది.

టాలీవుడ్ లో మరికొందరు హీరోలు ప్రస్తుతం కొన్ని రీమేక్స్ ని లైన్ లో పెట్టుకొని ఉన్నారు. తమిళ్ లో విజయం సాధించిన 'వేదలమ్' చిత్రాన్ని 'బోళా శంకర్' పేరుతో చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. అలానే 'వినోదం సీతమ్' రీమేక్ కు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలి చిత్రాల ఫలితాలను పరిగణలోకి తీసుకొని ఇకపై రీమేక్ సినిమాల విషయంలో అలోచించి నిర్ణయం తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఆల్రెడీ కమిటైన ప్రాజెక్ట్స్ ని పూర్తి చేసి భవిష్యత్ లో రీమేక్స్ జోలికి వెళ్లకుండా.. ఒరిజినల్ కంటెంట్ తో సినిమా చేయాలని సూచిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.