Begin typing your search above and press return to search.

మెగాస్టార్ రిజెక్ట్ చేసిన స్టోరీతో హిట్ కొడతాడా..??

By:  Tupaki Desk   |   19 April 2022 2:30 AM GMT
మెగాస్టార్ రిజెక్ట్ చేసిన స్టోరీతో హిట్ కొడతాడా..??
X
ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తునన్నాడు మాస్ మహారాజా రవితేజ. అందులో ''టైగర్ నాగేశ్వరరావు'' మూవీ ఒకటి. ఇది రవితేజకు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూవర్ట్ పురంలో పేరుమోసిన గజదొంగ.. పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టిన నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

అయితే ఈ టైగర్ నాగేశ్వరరావు స్టోరీ రవితేజ కంటే ముందు చాలామంది హీరోల చేతులు మారిందని తెలుస్తోంది. దర్శకుడు వంశీ ఈ స్క్రిప్ట్ ను గతేడాది కరోనా పాండమిక్ టైంలో మెగాస్టార్ చిరంజీవి కి వినిపించారు. ఈ విషయాన్ని చిరు స్వయంగా వెల్లడించారు. ఈ కథను వంశీ తనకు వినిపించాడని.. చాలా బాగా నచ్చిందని అన్నారు.

ఇందులో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటుగా మంచి క్యారెక్టరైజేషన్ ఉందని.. కానీ ఏదో కుదరక తాను చేయలేదని.. ఇది రవితేజకు సరిగ్గా సరిపోతుందని చిరంజీవి తెలిపారు. అయితే మెగాస్టార్ తన ఇమేజ్ కి ఈ స్టోరీ సూట్ కాదనే రిజక్ట్ చేశాడని టాక్ ఉంది. అంతేకాదు ఆ తర్వాత ఆ కథ చాలా మంది హీరోల వద్దకు వెళ్లి, చివరకు రవితేజ ఓకే చెప్పడంతో సెట్స్ పైకి వెళ్లిందని అంటున్నారు.

ఏదైతేనేం చిరంజీవి తిరస్కరించిన స్క్రిప్ట్‌ తోనే ఇప్పుడు రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా చేస్తున్నారు. ఎవరో చేయాల్సిన సినిమా మరెవరో చేసి సక్సెస్ అందుకున్న సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయి. అంతెందుకు రవితేజ కూడా వేరే హీరోతో అనుకున్న స్క్రిప్ట్ తో హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు చిరు రిజెక్ట్ చేసిన కథతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

ఇకపోతే ఇటీవల చిరు సమక్షంలోనే 'టైగర్..' మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఖర్చుతో నిర్మించిన ఓ సెట్ లో షూటింగ్ జరుగుతుందని సమాచారం. దీని కోసం దాదాపు 7 కోట్లు ఖర్చు చేసారట. ఈ సినిమాకు మాస్ రాజా రెమ్యునరేషన్ కూడా పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. 'ఖిలాడీ' తర్వాత ఇది రవితేజ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందే సినిమా.

ఇందులో రవితేజ సరసన బాలీవుడ్ భామలు నుపూర్ సనన్ - గాయత్రి భరధ్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించబోతోంది. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పై నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికిసంగీతం సమకూరుస్తున్నారు. మధే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. 'ఖిలాడి' చిత్రంతో భారీ ప్లాప్ అందుకున్న రవితేజ.. ''టైగర్ నాగేశ్వరరావు'' సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.