Begin typing your search above and press return to search.

ప్రకాశ్ రాజ్ టీం నుంచి ముగ్గురు ఔట్? మొదట్లోనే షాక్?

By:  Tupaki Desk   |   5 July 2021 3:30 AM GMT
ప్రకాశ్ రాజ్ టీం నుంచి ముగ్గురు ఔట్? మొదట్లోనే షాక్?
X
టాలీవుడ్ లో కాక రేపటమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ కార్యవర్గ ఎన్నికలు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది మొదట్లో జరగాల్సిన ఈ ఎన్నికల్ని కరోనా కారణంగా వాయిదా వేశారు. ఈ ఎన్నికల్లో తాను అధ్యక్ష స్థానం నుంచి పోటీ చేయనున్నట్లుగా ప్రకటించి సంచలనంగా మారటమే కాదు.. వేగంగా పరిణామాలు మారేందుకు కారణమయ్యారు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్. స్వతహాగా కన్నడిగుడైన ఆయన ‘మా’ లో ఎలా పోటీ చేస్తారంటూ చిత్రమైన వాదనను తీసుకొచ్చారు.

లోకల్.. నాన్ లోకల్ అంటూ కొత్త మాటలు తెర మీదకు వచ్చాయి. ఓపక్క ఇలాంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. మరోవైపు ప్రకాశ్ రాజ్ బలం తక్కువేం కాదు సుమా అంటూ.. ఆయన తన ప్యానల్ సభ్యుల వివరాల్ని మీడియాకు విడుదల చేయటం.. ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చేయటంతో.. టాలీవుడ్ కు చెందిన పలువురు ఒక్కసారిగా అలెర్టు అయ్యారు. ఒకరు తర్వాత ఒకరు అన్నట్లుగా ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ తెర మీదకు వచ్చారు.

ఇలా ఏకంగా నలుగురు ప్రముఖులు.. తాము ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేది ఖాయమని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ప్రకాశ్ రాజ్ తన టీంతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి మరింత దూకుడు ప్రదర్శించారు. తన ప్యానల్ కు చెందిన కొందరు వేర్వేరుప్రాంతాల్లో ఉన్న నేపథ్యంలో.. వారు మీడియా మీట్ కు రాలేదని చెప్పటమే కాదు.. ఫోన్లో వీడియో ద్వారా.. వారి సందేశాన్ని చూపించారు. ఇదిలా ఉంటే.. సదరు ప్రెస్ మీట్ లో మెగా సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు కలకలాన్ని రేపాయి. కొద్దికాలంగా ‘మా’ మసకబారిందన్న ఆయన వ్యాఖ్యపై పలువురు ఫీల్ అయ్యారు.

ఆయనకు ముందు మాట్లాడిన బండ్ల గణేశ్ ఆచితూచి మాట్లాడి.. అందరిని కలుపుకు పోయేలా మాట్లాడితే.. నాగబాబు మాత్రం కాస్తంత దూకుడును ప్రదర్శించారు. నాగబాబువ్యాఖ్యల అనంతరం చాలానే పరిణామాలు చోటు చేసుకున్నాయి. అన్నింటికి మించి.. నాగబాబు‘మా’ అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో ‘మా’ ఆఫీస్ కోసం సింగిల్ బెడ్రూం ప్లాట్ ను కొనుగోలు చేయటం.. దానికి భారీగా ఖర్చు చేసిన వైనం బయటకు వచ్చింది. ఇంతా చేస్తే.. దాన్ని ఆయన తర్వాత అధ్యక్షుడైన శివాజీరాజా కారుచౌకగా అమ్మేశారన్న ఆరోపణలతో కథనాలు వచ్చి సంచలనంగా మారాయి.

అంతేకాదు.. ‘మా’ అసోసియేషన్ కు సంబంధించిన మరికొన్ని అంశాలు మీడియాలో వార్తలుగా వచ్చాయి. 900 మందికి పైగా సభ్యులున్న ఈ అసోసియేషన్ బైలా కేవలం మూడు పేజీలే అన్న మాటతో పాటు.. ఇందులో ఉన్న లోపాలపై కథనాలు రావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో.. ఇప్పటివరకు అధ్యక్ష స్థానం బరిలో ఉంటానని.. తాను విజయం సాధిస్తే.. ‘మా’ రూపురేఖలు మారుస్తానని చెప్పటమేకాదు.. తన ప్యానెల్ లో అందరూ ప్రశ్నించేవారేనని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.

అలాంటి స్వంతంత్ర భావాలున్న ముగ్గురు.. తాము ప్రకాశ్ రాజ్ కు మద్దతు ఇవ్వలేమని తాజాగా తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామం ప్రకాశ్ రాజ్ టీంలో కొత్త కలకలంగా మారిందని చెబుతున్నారు. ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసి ఏదో మంచి చేయాలనే అనుకున్నాం కానీ.. లోతుల్లోకి వెళుతుంటే తమకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నట్లుగా అర్థమవుతుందని.. అందుకే తాము మిడిల్ డ్రాప్ కావాలని డిసైడ్ అయినట్లుగా చెప్పటమే కాదు..

.అందుకు తగ్గ ప్రకటనలు చేస్తామని చెబుతున్నట్లు సమాచారం. అదే జరిగితే.. తమ ప్యానల్ కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని.. తొందరపడొద్దని సదరు ముగ్గురిని కోరుతున్నట్లు చెబుతున్నారు. మరీ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.