Begin typing your search above and press return to search.

ప్రాణాలు బ‌లిగొన్న అభిమానం

By:  Tupaki Desk   |   5 Jan 2016 7:24 AM GMT
ప్రాణాలు బ‌లిగొన్న అభిమానం
X
సినీ హీరోలు - హీరోయిన్ల‌ను చాలా మంది అభిమానులు దైవంగా భావిస్తుంటారు. అందుకే కొందరు హీరోయిన్‌ ల‌కు గుడి కూడా క‌ట్టేశారు. ఈ అభిమానం అంతకంత‌కూ హ‌ద్దులు దాటిపోతోంది.. అభిమానం పోయి.. పోటీత‌త్వం పెరిగిపోతోంది. త‌మ హీరోనే గొప్ప ..కాదు కాదు మా హీరోనే గొప్పంటూ అభిమానుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు కూడా జ‌రుగుతున్నాయి. అయితే కొన్నిసార్లు ఈ విప‌రీత‌మైన అభిమానం వ‌ల్ల కొంత‌మంది త‌మ ప్రాణాలు కోల్పోతున్నారు.. కొన్ని ఆడియో ఫంక్ష‌న్‌ ల‌లో తొక్కిస‌లాట‌లు జ‌ర‌గ‌డం వ‌ల్ల ఇద్ద‌రు ముగ్గురు అభిమానులు చ‌నిపోవ‌డం వంటి సంఘ‌ట‌న‌లు వాళ్ల కుటుంబ స‌భ్యుల‌నే కాక‌.. ఆ హీరోల‌కు కూడా బాధ పెడుతున్నాయి. అటువంటి దుర్ఘ‌ట‌నే ఇప్పుడు జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు మ‌హేష్‌ బాబు అభిమానులు మ‌ర‌ణించారు.

తూర్పుగోదావ‌రి జిల్లా మండ‌పేటకు చెందిన న‌రేష్‌(20) - దుర్గ(18) - ప్ర‌సాద్‌(16).. మ‌హేష్‌ బాబుకు వీరాభిమానులు. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా వీరు 30 అడుగులు ఎత్త‌యిన మ‌హేష్ ఫ్లెక్సీని త‌యారుచేయించారు. ఈ ఫ్లెక్సీని వారు విద్యుత్ స్తంభానికి క‌ట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆ ఫ్లెక్సీ క‌డుతున్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా అగ్నిప్రమాదం జ‌రిగింది. దీంతో ఆ ముగ్గురికీ విద్యుత్ షాక్ త‌గలడంతో అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. ఇంకో ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. చేతికి అందివ‌చ్చి.. ఆస‌రాగా నిలుస్తార‌నుకున్న ఆ యువ‌కులు తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోవ‌డంతో వారి కుటుంబ‌స‌భ్యులు క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు. వాళ్లు మ‌హేష్‌ బాబుకు పెద్ద అభిమానుల‌ని... మ‌హేష్‌ సినిమా విడుద‌ల‌యితే మొద‌టి రోజు మొద‌టి షో చూసేంత వెర్రీ అభిమానం త‌మ పిల్ల‌ల‌ద‌ని ఆ యువ‌కుల త‌ల్లిదండ్రులు క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు.