Begin typing your search above and press return to search.

ఇది 'మేజర్' ర్యాంపేజ్ గ్లిమ్స్ మాత్రమే..!

By:  Tupaki Desk   |   22 Feb 2022 7:34 AM GMT
ఇది మేజర్ ర్యాంపేజ్ గ్లిమ్స్ మాత్రమే..!
X
వర్సటైల్ యాక్టర్ అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ''మేజర్''. 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా సమ్మర్ కానుకగా 2022 మే 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

'మేజర్' సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు - గ్లిమ్స్ మరియు 'హృదయమా' అనే ఫస్ట్ సింగిల్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో త్వరలో టీజర్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు.

ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించిన హీరో అడవి శేష్.. ''టీజర్ కేవలం 'మేజర్‌' లో జరిగిన ర్యాంపేజ్ యొక్క సంగ్రహావలోకనం మాత్రమే'' అని పేర్కొన్నారు. ఎయిమ్ - సెట్ - లాక్.. మే 27.. ఈ వేసవిలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మాత్రమే విడుదలవుతుందని తెలిపారు.

''మేజర్'' చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

హీరో అడవి శేష్ ఈ బయోపిక్ కు కథ - స్క్రీన్ ప్లే అందించడం విశేషం. అబ్బూరి రవి సంభాషణలు రాయగా.. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఇందులో అడివి శేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా.. శోభితా ధూళిపాళ్ళ - ప్రకాష్ రాజ్ - రేవతి - మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

'మేజర్' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా హిందీ - మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయినట్లు సమాచారం.