Begin typing your search above and press return to search.

నార్త్ లో సత్తా చాటిన సౌత్ సినిమాలు ఇవే..!

By:  Tupaki Desk   |   20 April 2022 10:36 AM GMT
నార్త్ లో సత్తా చాటిన సౌత్ సినిమాలు ఇవే..!
X
ప్రస్తుతం భారతీయ సినిమాలో దక్షిణాది ఆధిపత్యం నడుస్తోందని అనడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు నార్త్ జనాలు సౌత్ చిత్రాలను పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఎంత మంచి సినిమా తీసినా దాన్ని ప్రాంతీయ చిత్రంగానే చూసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రాంతీయ సినిమా అంటే పాన్ ఇండియా మూవీ అనే రోజులు వచ్చాయి.

దక్షిణాది సినిమాలు ఇప్పుడు బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొడుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. నార్త్ మార్కెట్ లో సౌత్ సినిమా స్టామినా చూసి బీ టౌన్ ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది. నాలుగు నెలల గ్యాప్ లో మూడు సౌత్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాయంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు హిందీ సర్క్యూట్స్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన దక్షిణాది సినిమాలను ఒకసారి పరిశీలిద్దాం..!

* బాహుబలి 2' : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌ లో తెరకెక్కిన సినిమా ఇది. 'బాహుబలి: ది బిగినింగ్' కు కొనసాగింపుగా వచ్చింది. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా 2017 ఏప్రిల్ 28న విడుదలై బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సాధించింది. నార్త్ లో ఫస్ట్ డే 40 కోట్లు వసూలు చేసింది. ఓవరాల్‌ గా రూ. 510 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించి బాలీవుడ్‌ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సౌత్ సినిమాగాఅగ్రస్థానంలో నిలిచింది.

* 'RRR' : యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం.. 2022 మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మల్టీస్టారర్ మూవీ ఇప్పటి వరకు 1100 కోట్ల వరకూ వసూలు చేసింది. ఇక నార్త్ బెల్ట్ లో ఫస్ట్ డే 20 కోట్లు మాత్రమే రాబట్టిన ఈ సినిమా.. నాలుగు వారానికి రూ. 255.04 కోట్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

* 'కేజీయఫ్ 2' : రాకింగ్ స్టార్ యశ్ - డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందిన కన్నడ సినిమా ఇది. హోంబలే ఫిలింస్ పతాకంపై తెరకెక్కిన 'కెజియఫ్' చిత్రానికి కొనసాగింపుగా వచ్చింది. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఫస్ట్ డే రూ. 53.95 కోట్లు - రెండో రోజు రూ. 46.79 కోట్లు - మూడో రోజు రూ. 42.90 కోట్లు - నాలుగో రోజు రూ. 50.35 కోట్లు - 5వ రోజు సోమవారం 25.57 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. మొత్తంగా ఐదు రోజుల్లోనే రూ. 219.56 కోట్ల వసూళ్లతో మూడో స్థానంలో నిలిచింది.

* '2.0' : సూపర్ స్టార్ రజినీకాంత్ - స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన తమిళ సినిమా ఇది. లైకా సంస్థ నిర్మించిన ఈ చిత్రం 2018 నవంబర్ 29న రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ 'రోబో' కి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా భాగం అయ్యారు. దీంతో హిందీ సర్క్యూట్స్ లో మంచి వసూళ్ళు అందుకుంది. మొత్తంగా బాలీవుడ్ లో రూ. 189 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది.

* 'సాహో' : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రం 2019 ఆగస్ట్ 30న థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీ తెలుగులో ప్లాప్ టాక్ తెచ్చుకున్నా.. హిందీ బెల్ట్ లో మాత్రం అధిక వసూళ్ళు అందుకుంది. తొలి రోజే 24 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం.. లాంగ్ రన్ లో రూ. 150.6 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

* 'బాహుబలి' : ఎస్ఎస్ రాజమౌళి - ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా 2015 జులై 10న విడుదలై ఘనవిజయం సాధించింది. హిందీలో ఫస్ట్ డే 5.15 కోట్లు సాధించింది. అప్పటికి ఇదే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సౌత్ సినిమా. ఓవరాల్‌ గా రూ. 116 కోట్లు వసూలు చేసింది. దీంతో రెండో భాగంపై భారీ అంచనాలు ఏర్పడటం.. దీనికి తగ్గట్టుగానే నార్త్ లో రూ. 510 కోట్లు కలెక్ట్ చేయడం తెలిసిందే.

* 'పుష్ప' : అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌ లో వచ్చిన సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. 2021 డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి.. అసలు హిందీలో రిలీజ్ అవుతుందో లేదో అనే పరిస్థితులు వచ్చాయి. ఎట్టకేలకు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా విడుదలైన ఈ చిత్రం.. ఫస్ట్ డే హిందీలో 3.31 కోట్లు మాత్రమే రాబట్టింది. ఆ తర్వాత పుంజుకొని రోజు రోజుకూ వసూళ్ళు పెంచుకుంటూ పోయింది. ఓవరాల్‌ గా ఉత్తరాదిలో రూ. 108.61 కోట్ల కలెక్షన్స్ సాధించింది. మరి రెండో భాగం 'పుష్ప: ది రూల్' ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.