Begin typing your search above and press return to search.

థియేట‌ర్స్ తెర‌వ‌డం పై ఇండ‌స్ట్రీలో భిన్న ధోరణులు...!

By:  Tupaki Desk   |   8 Oct 2020 5:30 PM GMT
థియేట‌ర్స్ తెర‌వ‌డం పై ఇండ‌స్ట్రీలో భిన్న ధోరణులు...!
X
కేంద్ర ప్రభుత్వం అన్‌ లాక్‌ 5.0 మార్గదర్శకాలతో భాగంగా సినిమా థియేటర్స్‌ మరియు మల్టీప్లెక్సులు తెరచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 50 శాతం ఆక్యుపెన్సీతో అక్టోబర్ 15 నుంచి థియేటర్స్‌ ను ఓపెన్‌ చేసుకోవచ్చునని సూచించింది. అంతేకాకుండా సినిమా థియేటర్స్ పాటించాల్సిన నియమ నిబంధనలు.. ప్రతి షోకు యాజమాన్యం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలియజేసింది. సీట్లను కేటాయించేటప్పుడు భౌతిక దూరం ఉండేలా చూసుకోవాలని.. థెర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేసుకోవాలని.. థియేటర్స్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. థియేటర్‌ సిబ్బంది కూడా బూట్లు, గ్లవ్స్‌, మాస్కులు, పీపీఈ కిట్స్‌ వేసుకుని శానిటైజ్‌ చేసుకోవాలని.. ప్రేక్షకుల ఫోన్ నెంబర్‌ తప్పకుండా తీసుకోవాలని నిబంధనలు విధించింది. ఏడు నెలలుగా మూతబడిపోయి ఉన్న సినిమా హాళ్లు తెరుచుకోనున్నాయని అందరూ అనుకుంటున్నారు. అయితే అక్టోబర్ 15 నుంచి థియేట‌ర్స్ తెర‌వ‌డం పై ఇండ‌స్ట్రీలో భిన్న ధోర‌ణ‌లు వినిపిస్తున్నాయని తెలుస్తోంది.

థియేటర్స్ తెరుచుకోవచ్చని చెప్పినా చాలా మంది ఫిలిం మేకర్స్ త‌మ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పెండింగ్ ఉందని.. త‌మ సినిమా ఇంకా షూటింగ్ జ‌ర‌గాల్సి ఉంద‌ని ఇలా రకరకాల కారణాలు చెప్పి సినిమాని రిలీజ్ చేయడానికి ముందుకు రావడం లేదట. దీనికి కారణం ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా చూడటానికి థియేటర్ కి జనాలు వస్తారో లేదో.. పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందో లేదో అని మేకర్స్ ఆలోచించడమే అని తెలుస్తోంది. దీనికి తోడు ఇప్పుడు థియేటర్ ఓన‌ర్స్ కూడా అక్టోబ‌ర్ 15 నుంచి తెర‌వ‌డం వీలు కాద‌ని అంటున్నారట. థియేట‌ర్స్ చాలా రోజులుగా ఖాళీగా ఉండ‌టంతో కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయ‌ని.. వాటిని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా బాగుచేసుకోవాల్సి ఉందని.. అందులోనూ కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలకు తగ్గట్టుగా మార్పులు చేసుకోవాల్సి ఉందని థియేట‌ర్స్ ఓనర్స్ అభిప్రాయపడుతున్నారు. అందుకే దీపావ‌ళి సీజ‌న్ లో థియేట‌ర్స్ తెరిచేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని కొంద‌రు థియేట‌ర్స్ ఓన‌ర్స్ చెప్తున్నారు. ఇప్పటికే కాకినాడ ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు. అయితే తెలంగాణా రాష్ట్రంలో ఈ విషయంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.