Begin typing your search above and press return to search.

డైరెక్టర్ పాదాలపై పడి కన్నీళ్లు పెట్టుకున్న మహిళ!

By:  Tupaki Desk   |   12 March 2022 11:30 AM GMT
డైరెక్టర్ పాదాలపై పడి కన్నీళ్లు పెట్టుకున్న మహిళ!
X
సామాజిక సంఘటనలను .. సమస్యలను తెరకెక్కించడంలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి మంచి పేరు ఉంది. యథార్థ సంఘటనలను అత్యంత సహజంగా తెరపై ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత. ఆయన సినిమాలు చూసే ప్రేక్షకులు తాము థియేటర్లో కాకుండా ఆ కథలో భాగమవుతారు. ఆ సన్నివేశంలో తాము కూడా ఒక మూలన ఉన్న అనుభూతి చెందుతారు. అంతా తమ కళ్లముందు ప్రత్యక్షంగా జరుగుతున్న ఫీలింగ్ ను పొందుతారు. అందువలన కథలో వాస్తవికతకు ప్రాధాన్యతనిచ్చేవారు ఆయన సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

ఆయన తాజా చిత్రంగా 'ది కశ్మీరీ ఫైల్స్' సినిమా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కథాంశం పై ఉన్న అవగాహన .. దర్శకుడి ప్రతిభపై గల నమ్మకం కారణంగా ముందు నుంచే ఈ సినిమాపై అందరిలో ఆసక్తి .. అంచనాలు పెరుగుతూ వచ్చాయి.

1990లో కశ్మీర్ పండిట్ ల సామాజిక హత్యాకాండ నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. అనుపమ్ ఖేర్ .. మిథున్ చక్రవర్తి .. దర్శన్ కుమార్ .. పల్లవి జోషి ప్రధానమైన పాత్రలను పోషించారు. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి అనూహ్యమైన స్పందన వస్తోంది.

హర్యాన ప్రభుత్వం ఈ సినిమాకు పన్ని మినహాయింపును ఇస్తున్నట్టుగా అధికారిక ట్వీట్ చేసింది. హర్యాన ప్రభుత్వం .. ముఖ్యమంత్రి ఇస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలియజేస్తూ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి రీ ట్వీట్ చేశాడు. ఈ సినిమా చూసినవారు వివేక్ అగ్నిహోత్రిని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.

ఈ సినిమాకి నీరాజనాలు పడుతున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కదిలిపోతున్నారు .. కన్నీళ్లు పెడుతున్నారు. ఈ మధ్య కాలంలో మనసును ఇంతగా కదిలించిన సినిమా రాలేదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన ఒక వీడియోను క్రికెటర్ సురేశ్ రైనా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ సినిమా చూసిన ఒక మహిళ .. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి పాదాలపై పడి కన్నీళ్లు పెట్టుకుంది. వివేక్ అగ్నిహోత్రి .. దర్శన్ కుమార్ ఇద్దరూ కూడా ఆ సమయంలో ఎమోషనల్ అయ్యారు. ఆ మహిళను ఓదార్చారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మధ్యంలో విపరీతంగా వైరల్ అవుతోంది. టాక్ పరంగా ఈ సినిమా ఆకాశాన్ని తాకుతోంది . ఇక వసూళ్ల పరంగా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందనేది చూడాలి.