Begin typing your search above and press return to search.

17 ఏళ్లుగా సినిమాలకు దర్శకత్వం.. తాజా సినిమాతో వై కేటగిరి భద్రత

By:  Tupaki Desk   |   18 March 2022 3:30 PM GMT
17 ఏళ్లుగా సినిమాలకు దర్శకత్వం.. తాజా సినిమాతో వై కేటగిరి భద్రత
X
దాదాపుగా పదిహేడేళ్లుగా సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంత సుదీర్ఘకాలంలో అతడు తీసింది అక్షరాల ఎనిమిది సినిమాలు మాత్రమే. ఇందులో మూడు సినిమాలకు ఆయనే నిర్మాత కూడా. అంతేకాదు.. మొత్తం ఎనిమిది సినిమాల్లో ఆరింటికి స్క్రీన్ ప్లే ఆయనే రాసుకున్నారు. మిగిలిన దర్శకుల మాదిరి కాకుండా ఒక సినిమాకు ఒక సినమాకు రెండు నుంచి నాలుగేళ్ల మధ్య గ్యాప్ తీసుకోవటం ఆయనకు అలవాటు. అతడే.. వివేక్ అగ్నిహోత్రి.

దేనికదే అన్నట్లుగా ఉండే ఆయన సినిమాలు ఆయన్ను మిగిలిన దర్శకులకు భిన్నంగా నిలుపుతుంది. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలకు భిన్నమైన సినిమాను తీశాడు. అదే కశ్మీర్ ఫైల్స్. విడుదలకు ముందు వరకు పెద్దగా అంచనాలు లేని ఆ సినిమా ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారటమే కాదు.. సామాన్యుడి మొదలు దేశ ప్రధాని వరకు అందరూ ఆ సినిమా గురించే మాట్లాడుతున్నారు.

ఈ సినిమా గురించి మాట్లాడుకునే వారంతా.. ఆ సినిమాలోని నటుల గురించి కంటే కూడా.. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన వివేక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.

అంతలా అందరిని ప్రభావితం చేస్తున్న ఈ మూవీ ఇప్పుడు పెను సంచలనంగా మారింది. సీనియర్ ఐఏఎస్ అధికారులు లాంటి వారు సైతం ఈ సినిమాను చూశాక.. మన దేశంలోని ఒక భాగంలో ఇంతటి మారణహోమం జరిగిందా? అని విస్మయానికి గురవుతున్నారు. ఈ సినిమాను చూసిన తర్వాత బాగుందన్న మాట కంటే కూడా భావోద్వేగంతో పూడుకుపోయిన గొంతుతో.. మెదడు గురయ్యే షాక్ కళ్లల్లో ప్రతిఫలించే సమయంలో థియేటర్లో లైట్లు వెలగటం.. భారమైన మనసుతో బయటకు వస్తున్న పరిస్థితి.

సినిమా చూసి వచ్చిన తర్వాత ఒక రోజు కంటే ఎక్కువ ప్రభావం చూపించని పరిస్థితి. అందుకు భిన్నంగా కశ్మీర్ ఫైల్స్ మాత్రం ఏకంగా నాలుగైదు రోజులు అయ్యాక కూడా దాని గురించే మదిలో ఆలోచనలు మెదులుతూనే ఉంటాయి. ఏదో పనిలో మునిగిపోయిన వేళలోనూ.. ఒక్కసారి చప్పున వచ్చేసే ఆ సినిమాలోని సీన్లు.. మనసు మళ్లీ భారమయ్యేలా చేస్తుంది.

ఇంత ఎఫెక్టివ్ గా సినిమాను తీయటం.. సున్నితమైన అంశాన్ని ఉన్నది ఉన్నట్లుగా (చాలామంది అభిప్రాయం ప్రకారం జరిగిన మారణహోమంతో పోలిస్తే 10 శాతమే చూపించారన్న మాటను చెబుతున్నారు) చూపించే విషయంలో ప్రదర్శించిన ప్రతిభ.. వివేక్ అగ్నిహోత్రి గురించి మరింత తెలుసుకునేలా చేస్తుంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కశ్మీర్ ఫైల్స్ మూవీ నేపథ్యంలో ఆయనకు.. ఆయన కుటుంబానికి 'వై' కేటగిరి భద్రత కల్పించాలని మోడీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ సినిమాకు ఉత్తరప్రదేశ్.. గుజరాత్.. అసోం.. హర్యానా.. మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పన్ను రాయితీని ఇచ్చారు. అసోం ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి.. ఈ సినిమాను చూసి.. టికెట్ ను ఆఫీసులో ఇస్తే.. ఒక పూట సెలువు ఇచ్చే వెసులుబాటు కల్పించారు.

ఈ మూవీ గురించి జరుగుతున్న చర్చ నేపథ్యంలో దర్శకుడి భద్రత గురించి ఆలోచించిన కేంద్ర ప్రభుత్వం.. ఆయనకు సెక్యురిటీని పెంచటమే కాదు.. ఆయన ఎక్కడకు వెళితే.. అక్కడ సీఆర్ఫీఎఫ్ భద్రత కల్పించాలని నిర్ణయించారు. ఆయనపై దాడులు జరిగే అవకాశం ఉండటంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.