Begin typing your search above and press return to search.

మూడేళ్లుగా మాంజిమ‌తో హీరో డేటింగ్.. పెళ్లితో సుఖాంతం!

By:  Tupaki Desk   |   28 Nov 2022 7:38 AM GMT
మూడేళ్లుగా మాంజిమ‌తో హీరో డేటింగ్.. పెళ్లితో సుఖాంతం!
X
'సాహ‌సం శ్వాస‌గా సాగిపో' చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది మాంజిమ మోహ‌న్. నాగ‌చైత‌న్య స‌ర‌స‌న ఈ బ‌బ్లీ బ్యూటీ న‌ట‌న అంద‌రినీ ఆక‌ట్టుకుంది. గౌత‌మ్ మీన‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే ఇటీవ‌ల‌ మంజిమా మోహన్ ఉనికి తెలుగు చిత్ర‌సీమ‌లో పూర్తిగా మిస్స‌యింది. ఇంత‌కీ మాంజిమ ఏం చేస్తోంది? అన్న‌ది ఆరా తీస్తే.. ఈ భామ మూడేళ్లుగా ఓ యువ‌హీరోతో ప్రేమాయ‌ణంలో ఉంద‌ని తెలిసింది. తాజాగా స‌ద‌రు యంగ్ హీరోని పెళ్లాడి శుభ‌వార్త‌ను చెప్పేసింది. యువ‌హీరో గౌతమ్ కార్తీక్ తో మాంజిమ రిలేషన్ షిప్ స్టేటస్ ఇటీవ‌ల అధికారికం అయ్యింది. ఈ సోమ‌వారం (28న‌వంబ‌ర్) ఇరు కుటుంబాల సమక్షంలో ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు.

మంజిమ తన ఇన్ స్టా ప్రొఫైల్ లో తన పెళ్లి ఫోటోలను షేర్ చేసింది. ఈరోజు ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేట్ అతిథి గృహంలో గౌతమ్ తో ఆమె వివాహం జరిగింది. పెళ్లికి ముందు ఈ జంట‌కు ప‌రిచ‌యం ఎలా? అంటే.. సినిమా సెట్లో క‌లిసారు. త‌ర్వాత స్నేహం కుదిరింది. అది ప్రేమ‌గా మారింది. గత మూడు సంవత్సరాలుగా ఈ జంట‌ డేటింగ్ చేసారు. అయితే దీనికి అంత‌గా ప‌బ్లిసిటీ లేదు. ఏదేమైనా నేడు మాంజిమ త‌న ప్రేమికుడు గౌత‌మ్ ని పెళ్లాడేసింది. ఈ పెళ్లి ఫొటోలు క్షణాల్లో వైరల్ గా మారాయి. న‌వ వ‌ధూవ‌రుల‌ కొత్త ప్రయాణం ఆనంద‌క‌రంగా సాగాల‌ని పలువురు ప్రముఖులు అభిమానులు యువ జంటను ఆశీర్వదించారు.

మ‌రింత‌గా వివ‌రాల్లోకి వెళితే.. గౌతం కార్తీక్ - మంజిమా మోహన్ ఈ నెల ప్రారంభంలో తమ రిలేషన్ షిప్ గురించి బహిరంగంగా వెల్లడించారు. ఈ రోజు వారి స్నేహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. 28 నవంబర్ ఈ జంట‌కు చాలా ప్ర‌త్యేక‌మైన రోజుగా నిలిచింది. కొద్దిమంది సన్నిహితులు కుటుంబ సభ్యుల స‌మ‌క్షంలో ప్రైవేట్ వ్యవహారంగా ఈ పెళ్లి వేడుక సాగింది. ఈ వివాహానికి ప‌లువురు సినీ ప్రముఖులు హాజరై క్యూట్ కపుల్ ను ఆశీర్వదించారు. వివాహానికి హాజరైన వారిలో దర్శకుడు మణిరత్నం, -గౌతమ్ మీనన్- విక్రమ్ ప్రభు- ఆర్ కె సురేష్- శివకుమార్- ఐశ్వర్య రజనీకాంత్- అశోక్ సెల్వన్- ఆది-నిక్కీ గల్రానీ ఉన్నారు.

గౌతమ్ కార్తీక్ -మంజిమా మోహన్ 2019 లో 'దేవరాట్టం' చిత్రంలో కలిసి పనిచేసే క్ర‌మంలో షూటింగ్ సమయంలో మంచి స్నేహితులుగా మారారు. ఆ చిత్రం తర్వాత మాత్రమే ప్రేమలో పడ్డారు. తమ సంబంధాన్ని పబ్లిక్ చేసినప్పటి నుండి యువ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు కార్తీక్ కుమారుడు గౌతమ్. లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం ద‌ర్శ‌క‌త్వంలో 'కడల్‌' అనే చిత్రంతో అత‌డు వెండితెర‌కు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కోలీవుడ్‌లో అనేక చిత్రాలలో న‌టించాడు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ 'అచ్చం యెన్బతు మడమైయాడా'తో అరంగేట్రం చేసిన మంజిమ త‌దుప‌రి FIR సహా మ‌రికొన్ని చిత్రాలలో న‌టించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.