Begin typing your search above and press return to search.

'ఉప్పెన' దర్శకుడికి పెరుగుతున్న క్రేజ్

By:  Tupaki Desk   |   16 Feb 2021 11:30 PM GMT
ఉప్పెన దర్శకుడికి పెరుగుతున్న క్రేజ్
X
ప్రేమకథలతో వచ్చిన చిక్కే అదండి బాబూ .. వాళ్లకి నచ్చిందా అంటే సీట్లు పట్టుకుని వదలరు .. థియేటర్ నుంచి ఆ సినిమాను కదలనివ్వరు. ఇప్పుడు 'ఉప్పెన' పరిస్థితి అలాగే ఉంది. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా వైష్ణవ్ తేజ్ .. కృతిశెట్టి నాయకా నాయికలుగా పరిచయమయ్యారు. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన భారీస్థాయిలో విడుదల చేశారు. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో, అదే రేంజ్ వసూళ్లతో ఆరంభమైంది.

మైత్రీ మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, యూత్ ను ఒక ఊపు ఊపేస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను .. మాస్ ఆడియన్స్ ను కూడా థియేటర్ కి రప్పిస్తోంది. ఇలా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకర్షిస్తూ ఉండటం వలన, ఈ సినిమా మూడు రోజుల్లో 30 కోట్లకి పైగా షేర్ ను .. 50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని అంటున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోను ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. ఎలాంటి క్రేజ్ లేని కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాకి ఈ స్థాయి రెస్పాన్స్ రావడం విస్మయులను చేస్తోంది.

థియేటర్ కి వెళ్లిన తరువాత కథాకథనాలు కూర్చోబెడుతున్నాయనీ, కానీ థియేటర్ కి రప్పించేది మాత్రం హీరోయిన్ కృతి శెట్టినే అనే టాక్ బలంగా వినిపిస్తోంది. కథాకథనాలను ఆసక్తికరంగా నడిపించడంలో .. పాత్రలను మలిచిన తీరులో దర్శకుడు బుచ్చిబాబు కనబరిచిన ప్రతిభ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఇక ఇండస్ట్రీ నుంచి కూడా బుచ్చిబాబుకు ప్రశంసలు దక్కుతున్నాయి. అంతేకాదు ఆయనకి వరుసగా ఆఫర్లు వస్తున్నాయట. ప్రేమకథనే చేసిపెట్టమనేవారి సంఖ్య ఎక్కువగా ఉందని అంటున్నారు. చూస్తుంటే .. బుచ్చిబాబు ప్రేమకథల స్పెషలిస్టుగా మారిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.