Begin typing your search above and press return to search.

గ్లామ‌ర్ పాత్ర‌లు చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం అదే: కీర్తి సురేష్‌

By:  Tupaki Desk   |   23 April 2022 8:30 AM GMT
గ్లామ‌ర్ పాత్ర‌లు చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం అదే: కీర్తి సురేష్‌
X
సినీ ఇండ‌స్ట్రీలో కొంద‌రు హీరోయిన్లు గ్లామ‌ర్ పాత్ర‌ల‌ను ఎంచుకుని ఓ రేంజ్ లో అందాలు ఆర‌బోస్తుంటే.. కొంద‌రు ముద్దుగుమ్మ‌లు మాత్రం న‌ట‌న‌కు మంచి స్కోప్ ఉన్న రోల్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ స్టార్స్ గా ఎదుగుతున్నారు. ఈ రెండో ర‌కానికి చెందిన హీరోయిన్ల జాబితాలో కీర్తి సురేష్ ఒక‌రు. మలయాళ సినీనిర్మాత సురేష్ కుమార్, ప్ర‌ముఖ‌ నటి మేనక కుమార్తె అయిన కీర్తి సురేష్‌.. చ‌దువుకుంటూనే బాల్య నటిగా ప‌లు సినిమాలు చేసింది.

2013లో వ‌చ్చిన 'గీతాంజలి' అనే మ‌లయాళ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి.. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'నేను శైల‌జ‌'తో తొలిసారి తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తూ గుర్తింపు పొందిన ఈమె.. 'మహానటి'తో స్టార్ స్టేట‌స్ ను అందుకుంది. సావిత్రి క్యారెక్టర్‌లో కీర్తీ సురేష్ అద్భుతంగా జీవించింది. సావిత్రి తెరపైన నటిస్తుందా అనే ఫీలింగ్‌ను ప్రేక్ష‌కుల‌కు క‌లిగించింది.

దీంతో సాధార‌ణ ప్రేక్ష‌కులు, అభిమానులే కాదు విమ‌ర్శ‌కులు సైతం కీర్తి సురేష్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. అయితే ఈ అందాల చంద‌మామ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి చాలా కాల‌మే అయినా.. ఇప్ప‌టి వ‌ర‌కు గ్లామ‌ర్ పాత్ర‌ల‌ను చేసింది లేదు. ఏ సినిమాలోనూ హ‌ద్దులు మీరి అందాలు ఆర‌బోసిందీ లేదు. కేవ‌లం నటనకు ప్రాధాన్యత ఉండే పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది.

అయితే గ్లామ‌ర్ పాత్ర‌లు చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏంటో కీర్తి సురేష్ చెప్పేసింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆమె.. స్కిన్ షో పాత్ర‌ల గురించి మాట్లాడింది. 'నటిగా నా అభినయం ప్రేక్షకులు ఇష్టపడాలని ఎప్పుడూ కోరుకుంటాను.

అదృష్టవశాత్తు నటనకు ఆస్కారమున్న పాత్రలే న‌న్ను వెతుక్కుంటూ వ‌స్తున్నాయి. వాటితోనే మీ ఆదరణ పొందుతున్నాను. గ్లామర్‌ పాత్రలు నా మొదటి ప్రాధాన్యం కానేకాదు. అయినా తెరపై ఎలా క‌నిపించాలి అనే విష‌యంలో నాకు కొన్ని హ‌ద్దులు ఉన్నాయి. వాటిని చెర‌ప‌లేను. అందు కార‌ణంగానే గ్లామ‌ర్ పాత్ర‌ల‌ను చేయ‌డం లేదు' అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.

కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. తెలుగులో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో కీర్తి క‌లిసి న‌టించిన‌ 'స‌ర్కారు వారి పాట‌' మే 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అలాగే మ‌ల‌యాళంలో ఈమె చేసిన 'చిన్ని' మూవీ ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో మే 6న రిలీజ్ కాబోతోంది. అంటే వారం గ్యాప్ లోనే కీర్తి సురేష్ రెండు చిత్రాల‌తో సంద‌డి చేయ‌బోతోంద‌న్నమాట‌.