Begin typing your search above and press return to search.

'గాడ్ ఫాదర్' కోసం రంగంలోకి దిగిపోయిన తమన్!

By:  Tupaki Desk   |   4 Oct 2021 11:39 AM GMT
గాడ్ ఫాదర్ కోసం రంగంలోకి దిగిపోయిన తమన్!
X
చిరంజీవి తాజా చిత్రంగా 'ఆచార్య' రూపొందింది. కొరటాల దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలకి ముస్తాబవుతోంది. ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకోగానే, చిరంజీవి 'గాడ్ ఫాదర్'ను పట్టాలెక్కించారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను 'ఊటీ'లో ప్లాన్ చేశారు. కొన్ని రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. చిరంజీవితో పాటు మరికొందరు సీనియర్ ఆర్టిస్టులు, ఈ షూటింగులో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది.

ఫస్టు షెడ్యూల్ పూర్తయిన తరువాత దర్శకుడు మోహన్ రాజా .. తమన్ మ్యూజిక్ సిటింగ్స్ ను మొదలుపెట్టారు. ఆ సమయంలో దిగిన ఫొటోను తమన్ ట్వీట్ చేశాడు. మోహన్ రాజా .. తమన్ తో పాటు కనిపిస్తున్నది, సినిమాటోగ్రఫర్ నీరవ్ షా. బలమైన సన్నివేశాలతో .. బరువైన ఎమోషన్స్ తో ఈ కథ నడుస్తుంది. అందుకు తగినట్టుగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను అందించడానికి తమన్ తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. కీలకమైన పాత్రలో శోభన కనిపించనుందని అంటున్నారు. చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాతో ఆమె రీ ఎంట్రీ ఇవ్వనుందని చెప్పుకుంటున్నారు.

మలయాళంలో మోహన్ లాల్ చేసిన 'లూసిఫర్' సినిమాకి ఇది రీమేక్. ఈ తరహా కథలను మోహన్ రాజా అయితే బాగా డీల్ చేస్తాడని ఆయనకి ఈ కథను అప్పగించారు. తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్పులు చేసిన ఆయన, ఈ కథను సెట్స్ పైకి తీసుకెళ్లారు. తన క్రేజ్ కి .. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా జరిగిన మార్పులు సంతృప్తిని ఇచ్చిన తరువాతనే చిరంజీవి కెమెరా ముందుకు వెళ్లారు. ఎన్వీ ప్రసాద్ .. ఆర్ బి చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమాకి, చరణ్ కూడా ఒక నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా చిరంజీవి కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందని చెప్పుకుంటున్నారు.

ఇక ఈ సినిమా తరువాత చిరంజీవి మెహర్ రమేశ్ .. బాబీ ప్రాజెక్టులను లైన్లో పెట్టేశారు. మెహర్ రమేశ్ తన సినిమాకి 'భోళా శంకర్' అనే టైటిల్ ను సెట్ చేశాడు. తన ప్రాజెక్టు సంబంధించిన మిగతా పనులను సెట్ చేసుకోవడంలో ఆయన బిజీగా ఉన్నాడు. మరో వైపున బాబీ 'వాల్తేర్ వీర్రాజు' సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాల్లో చిరంజీవి ముందుగా దేనిని మొదలుపెడతారనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలోనే శంకర్ - చరణ్ సినిమాలో చిరంజీవి ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే అందులో వాస్తవమెంతన్నది చూడాలి.

సాధారణంగా చిరంజీవి ఒక ప్రాజెక్టు తరువాత ఒక ప్రాజెక్టును సెట్ చేసుకుంటూ వెళుతుంటారు. కానీ ఈ సారి ఆయన ఒకేసారి మూడు భారీ ప్రాజెక్టులను కదిలించారు. 'ఆచార్య' షూటింగ్ కి అలా గుమ్మడికాయ కొట్టగానే ఆయన రంగంలోకి దిగిపోయారు. తన సినిమాల విషయంలో చిరంజీవి ఆచి తూచి వ్యవహరిస్తూ ఉంటారు. అందువలన సహజంగానే ఆలస్యమవుతూ ఉంటుంది. అలాంటిది ఆయన ఈ సారి కుర్ర హీరోలతో పోటీపడుతూ వరుస ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకువెళుతూ ఉండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.