Begin typing your search above and press return to search.

సంగీత దర్శకులు అప్ డేట్ కావాల్సిందేనా?

By:  Tupaki Desk   |   17 Dec 2019 6:45 AM GMT
సంగీత దర్శకులు అప్ డేట్ కావాల్సిందేనా?
X
సృజనాత్మకతకు అంతం లేదు.. ఆవిష్కరణలకు కొదవ లేదు. న్యూటన్ పై ఆపిల్ పండు పడకుంటే మనకు గురుత్వాకర్షణ సిద్ధాంతం పుట్టేది కాదు.. ఎడిసన్ బల్బ్ కనిపెట్టకుండా మనకు వెలుతురు ఉండేది కాదు.. సొంతంగా, క్రియేటివ్ గా ఆలోచనలు లేకపోతే ఈ సమాజం ఇలా ఉండేది కాదు. ఎప్పుడూ అవే ఆలోచనలా? కొత్తగా చేయాలి? సరికొత్త ప్రయోగాలు చేయాలి అప్పుడే విజయాలు సాధిస్తాం. టాలీవుడ్ నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ గా మొన్నటివరకు కీర్తినందుకున్న దేవీశ్రీ ప్రసాద్ ఇప్పుడు వెనుకబడిపోతున్నారని ఆయన పాటల ప్రవాహం చూశాక అభిమానులంతా తెగ బాధపడిపోతున్నారు. ఏమైందీ దేవికి..? ఇప్పుడిదే ప్రశ్న అందరిలోనూ ఉదయిస్తోంది. నిన్న దేవీ శ్రీ ప్రసాద్ నుంచి జాలువారిన మహేష్ బాబు సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’లోని పాట ‘హీ ఈజ్ సో క్యూట్’ పాట చూశాక అందరిలోనూ ఒకటే నిరుత్సాహం.. ‘రంగస్థలం’తో టాప్ లేపిన దేవీనేనా ఈ పాటలిచ్చింది అన్న సందేహం.?

*అప్ డేట్ కాని దేవీశ్రీలో మునుపటి వాడి తగ్గిపోయిందా?
కొత్త ఒక వింత.. పాత ఒక రోత.. కాలానికి అనుగుణంగా అప్ డేట్ అవుతున్న సంగీత దర్శకులే ప్రస్తుతం సంగీత ప్రపంచాన్ని ఏలుతున్నారు. ఒకప్పుడు దేశాన్ని షేక్ చేసిన ఏఆర్ రెహ్మాన్ ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. ఆయన నేటి తరానికి అనుగుణంగా మ్యూజిక్ అందించలేక పాత పాటలతోనే మ్యూజిక్ టూర్లు నిర్వహిస్తూ సినిమాలు తగ్గించేశారు. అదే తమిళ కుర్రాడు రవిచంద్రన్ కొత్త తరం మ్యూజిక్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు మన దేవీకి ఏమైందనే ప్రశ్న అందరిలోనూ ఉదయిస్తోంది. ఎంతో అద్భుతమైన పాటలిచ్చి టాలీవుడ్ ను షేక్ చేసిన దేవిలో మునుపటి వాడి ఎందుకు తగ్గింది. ఆస్థాయి మ్యూజిక్ ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్న అందరిలోనూ వస్తోంది. దేవీశ్రీ అప్ డేట్ కాకుండా పాత పాటల కోవలోనే మ్యూజిక్ దంచేస్తున్నారు. వాటిని అభిమానులు కనిపెట్టి సోషల్ మీడియాలో ఆడిపోసుకుంటున్నారు.

*తమన్ ఫీల్ మ్యూజిక్ తో ముందుకొచ్చాడా?
నవతరం యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ యాక్టర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా వచ్చాడు. రిపీట్ మ్యూజిక్ ఇస్తాడని పేరున్న తమన్ తాజాగా ‘అల వైకుంఠపురం’లో మంచి యూత్ ఫుల్ ఫీల్ మ్యూజిక్ ఇచ్చి అదరగొట్టారు. ఎక్కడా కనివీని ఎరుగని మంచి మనసులోంచి వచ్చిన తమన్ పాటల ప్రవాహం ఇప్పుడు యూత్ ను కట్టిపడేసింది. పూర్తిగా అప్ డేట్ అయినట్టు తమన్ ఇచ్చిన సంగీతం శ్రోతలను ఆకట్టుకుంటోంది. కొత్త ప్రయోగాలతో నేటి జనరేషన్ ఆలోచనలకు అనుగుణంగా తమన్ సంగీతం ఇచ్చేస్తున్నారు. దేవీ శ్రీ ఇక్కడే వెనుకబడి పోతున్నారు.

-మణిశర్మ కమ్ బ్యాక్ లో మెరుగయ్యాడా.?
ఇక తన సంగీతంతో ఒకప్పుడు టాలీవుడ్ లోనే నంబర్ 1 సంగీత దర్శకుడిగా ఉన్నారు మణిశర్మ. అయితే దేవీశ్రీ, తమన్ రాకతో సైడ్ అయిపోయారు. చాలా రోజులు మూస సంగీతంతో అవకాశాలు లేక ఖాళీగా ఉన్నాక మణిశర్మలోనూ మార్పు మొదలైంది. పూరి ‘ఇస్మార్ట్ శంకర్’తో తన రీఎంట్రీని ఘనంగా చాటాడు. చాలా వరకు నేటి మాస్ మాసాలా సాంగ్ లతో అప్ డేట్ సంగీతమందించారు. కొత్త యూత్ ఆలోచనలకు మాస్ నాడి పట్టేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో కింగ్ అయిన మణిశర్మ ఇప్పుడు పాటల్లోనూ పూర్తిగా అప్ డేట్ అయ్యి దూసుకొస్తున్నాడు.

-కీరవాణి అందుకే డ్రాప్ అవుతున్నాడా?
ఒకటికి పది సినిమాలు చేసే కంటే సంవత్సరానికి రెండేళ్లకైనా మంచి సినిమా చేసి అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చి తన సీనియారిటీని అలాగే కాపాడుకోవాలని కీరవాణి అనుకుంటున్నట్టున్నారు. కీరవాణి చేతిలో నేటి యంగ్ అండ్ యూత్ ఫుల్ సినిమాలేవీ పడలేదు. ఆయన గత సంవత్సరాలు చేసినవి బాహుబలి తోపాటు ఎన్టీఆర్ బయోపిక్ లాంటి పౌరణిక, హిస్టరీ చిత్రాలే ఉన్నాయి. అందుకే కీరవాణి నేటి తరం మ్యూజిక్ నుంచి డ్రాప్ అయినట్టే కనిపిస్తోంది. కేవలం తన తమ్ముడు రాజమౌలితోపాటు కొన్ని కీలకమైన చిత్రాలకే కీరవాణి పరిమితం అవుతూ దాదాపు టాలీవుడ్ లో డ్రాప్ అయినట్టే కనిపిస్తున్నారు. అప్ డేట్ కావడం కంటే తన పంథా మ్యూజిక్ తోనే కీరవాణి అద్భుతంగా ముందుకు సాగుతున్నారు.

*అప్ డేట్ కాకుంటే అంతే సంగతులు
మన శ్రోతలు చాలా తెలివైన వాళ్లు. ఎన్నో పాటలు విన్నారు. మనసులోంచి వచ్చిన పాటలను వైరల్ చేస్తుంటారు. కాపీ అని తేలితే సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేస్తుంటారు. అయినా సంగీతం చేయడం అంతా ఈజీ కాదు.. దానికి ఎంతో ఆలోచన, ప్రతిభ, సృజనాత్మకత అవసరం. ఊరికే ఐదారు సినిమాలు పట్టుకొని మూస మ్యూజిక్ ఇచ్చే బదులు సినిమాలు తగ్గించైనా సంగీత దర్శకులు కొత్త మ్యూజిక్ ఇస్తే వారి పేరు, పరపతి బాగుంటుంది. ఇక నేటి తరానికి అనుగుణంగా ప్రయోగాల సంగీతం చేస్తే పదికాలాల పాటు ఉంటారు. లేదంటే కనుమరుగవుతారు.