Begin typing your search above and press return to search.

'ఆచార్య' ప్లాన్ కు బ్రేక్స్ వేసిన భారీ చిత్రాలు..!

By:  Tupaki Desk   |   3 Aug 2021 6:30 AM GMT
ఆచార్య ప్లాన్ కు బ్రేక్స్ వేసిన భారీ చిత్రాలు..!
X
మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ''ఆచార్య''. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చిరు - చరణ్ - కొరటాల నుంచి చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా ఇది. 'సైరా' - 'వినయ విధేయ రామ' తర్వాత మెగా ఫాదర్ అండ్ సన్ నుంచి వస్తున్న సినిమా. 'భరత్ అనే నేను' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కొరటాల ఈ సినిమాపైనే వర్క్ చేస్తున్నారు. అయితే ఏ ముహూర్తాన ఈ చిత్రాన్ని మొదలుపెట్టాడో కానీ.. అడుగుడునా ఏదొక అడ్డంకి ఎదురవుతూనే ఉంది.

మొదట్లో హీరోయిన్ కష్టాలు వెంటాడితే.. ఆ తర్వాత కరోనా ఫస్ట్ వేవ్ ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఇదే క్రమంలో వర్షాలకు సెట్ దెబ్బ తినడం.. ఈలోపు కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం వచ్చి పడటం.. ఇలా 'ఆచార్య' చిత్రాన్ని అనేక అంశాలు అవాంతరాలు కలిగిస్తూనే ఉన్నాయి. 'ఆచార్య' సినిమా షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ లో ఉంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఎట్టకేలకు షూటింగ్ చివరి దశకు వచ్చింది అనుకుంటుండగా.. ఇప్పుడు విడుదల తేదీ సమస్యగా మారిందని టాక్ వినిపిస్తోంది.

టాలీవుడ్ లో ఇప్పటికే పెద్ద సినిమాలన్నీ విడుదల తేదీలను ప్రకటించాయి. దసరా కానుకగా అక్టోబర్ 13న 'ఆర్ ఆర్ ఆర్'.. సంక్రాంతి కి 'పవన్ కళ్యాణ్ - రానా' సినిమా - 'సర్కారు వారి పాట' 'రాధే శ్యామ్' 'ఎఫ్ 3' వంటి చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించాయి. దీపావళి పండక్కి రజినీకాంత్ 'అన్నాత్తే'.. క్రిష్మస్ సమయానికి 'పుష్ప' రిలీజులు ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో 'ఆచార్య' కు మంచి రిలీజ్ డేట్ దొరికే అవకాశం లేకుండా పోయింది.

నిజానికి సమ్మర్ కానుకగా మే 13న 'ఆచార్య' విడుదలను ప్లాన్ చేయగా.. కోవిడ్ ఎఫెక్ట్ తో వాయిదా వేయాల్సి వచ్చింది. రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' సినిమా దసరా ఫెస్టివల్ నాటికి వస్తుందో రాదో అనే సందేహాలు ఉన్నప్పుడు.. 'ఆచార్య' అక్టోబర్ 13 మీద ఆశలు పెట్టుకుంది. ఆ ధీమాతోనే మరో డేట్ ని లాక్ చేసుకోలేదు అనే టాక్ ఉంది. కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పిన టైం కి వస్తాం అన్నట్లుగా ట్రిపుల్ ఆర్ టీమ్ షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కొరటాల శివ అండ్ టీమ్ 2022 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న 'ఆచార్య' చిత్రాన్ని విడుదల చేయాలని ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 'అయ్యప్పన్ కొశీయుమ్' రీమేక్ ని అదే డేట్ కి లాక్ చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఇప్పుడు 'ఆచార్య' చిత్రాన్ని ఏ సీజన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే దీనిపై చిత్ర దర్శక నిర్మాతలు క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

కాగా, కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి 'ఆచార్య' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రామ్ చరణ్ కు జోడీగా పూజాహెగ్డే కనిపించనుంది. సంగీత బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తుండగా.. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చిరు - చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాయి.