Begin typing your search above and press return to search.

టాలీవుడ్ డ్రగ్స్ కేసు: తరుణ్ ను విచారిస్తున్న ఈడీ..!

By:  Tupaki Desk   |   22 Sep 2021 7:13 AM GMT
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: తరుణ్ ను విచారిస్తున్న ఈడీ..!
X
నాలుగేళ్ళ క్రితం టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ వ్యవహారాల్లో మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ.. పలువురి సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసి విచారిస్తోంది. ఈ క్రమంలో నేడు బుధవారం హీరో తరుణ్ ఈడీ అధికారులు ముందు హాజరయ్యారు.

డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న తరుణ్.. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని ఈడీ కార్యాల‌యంలో ఈడీ అధికారుల ఎదుట విచార‌ణ‌కు హాజరయ్యారు. మనీ ల్యాండరింగ్ - ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద తరుణ్‌ ను ఈడీ ప్రశ్నించనుందని సమాచారం. బ్యాంకు ఖాతాలను పరిశీలించి.. అనుమానాస్పద లావాదేవీల గురించి ఆరా తీయనున్నారు. అలానే డ్రగ్స్‌ విక్రేత కెల్విన్‌ తో ఉన్న సంబంధాల గురించి అధికారులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

డ్రగ్స్‌ కేసులో ఆరోపణలతో 2017 జులైలో తరుణ్ ను ఎక్సైజ్ శాఖ సిట్ విచారించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తరుణ్ బయో శాంపుల్స్ ను స్వచ్చంధంగా అధికారులకు ఇచ్చారు. అయితే తరుణ్‌ నుంచి అప్పుడు సేకరించిన నమూనాల్లో డ్రగ్స్‌ ఆనవాళ్లు లేవని ఇటీవల ఎఫ్ఎస్ఎల్‌ నివేదికలో తేలింది. రక్తం, తల వెంట్రుకలు, గోళ్లను పరీక్షించిన రాష్ట్ర ఫోరెన్సిక్‌ లేబొరేటరీ ఈ మేరకు నివేదిక విడుదల చేయడంతో.. తరుణ్‌ కు ఎక్సైజ్‌ శాఖ క్లీన్‌ చిట్‌ లభించింది.

కాగా, టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు తుదిదశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. మనీ లాండరింగ్‌ కోణంలో గత కొన్ని రోజుల నుంచి సినీ ప్రముఖులను విచారిస్తోంది. ఇప్పటికే పూరి జగన్నాథ్ - చార్మి కౌర్ - ర‌కుల్ ప్రీత్ సింగ్ - నందు - రానా దగ్గుబాటి - ర‌వితేజ - న‌వ‌దీప్‌ లను అధికారులు ప్రశ్నించారు. సుధీర్ఘంగా సాగిన ఈ విచారణలో వారి వద్ద నుంచి ఈడీ కీలక సమాచారం రాబట్టింది. ఈడీ నోటీసులు జారీ చేసిన 12 మంది ప్రముఖుల్లో తరుణ్‌ చివరి వ్యక్తి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌ శాఖ క్లీన్‌ చిట్‌ ఇచ్చిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ ఏమి తెలుస్తుందో చూడాలి.