Begin typing your search above and press return to search.

పోలీసుల వద్దకు చేరిన తనూశ్రీ వివాదం

By:  Tupaki Desk   |   7 Oct 2018 10:48 AM GMT
పోలీసుల వద్దకు చేరిన తనూశ్రీ వివాదం
X
మాజీ హీరోయిన్‌ తనూశ్రీ దత్తా గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో సంచలనంగా మారిన విషయం తెల్సిందే. నానా పటేకర్‌ పై ఈమె చేసిన ఆరోపణలపై రచ్చ జరుగుతుంది. భారీ ఎత్తున ఈ విషయమై వివాదం జరుగుతున్న నేపథ్యంలో తన పరువుకు నష్టం వాటిల్లింది అంటూ నానా పటేకర్‌ లీగల్‌ గా తనూశ్రీ దత్తాను ఎదుర్కొనేందుకు సిద్దం అయ్యాడు. ఇలాంటి సమయంలోనే తనూశ్రీ దత్తా కూడా పోలీసుల ముందుకు వెళ్లింది. బాలీవుడ్‌ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం తనూశ్రీ దత్తా పోలీసులను ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది.

పదేళ్ల క్రితం విషయాన్ని ఇప్పుడు పబ్లిసిటీ కోసం రచ్చ చేస్తున్నారని, మీకు అన్యాయం జరిగినట్లుగా భావిస్తే, మీపై లైంగిక దాడి జరిగితే మీరు పోలీసులను ఆశ్రయించాలి కాని, మీడియా ముందు ఎందుకు రచ్చ చేస్తున్నారు అంటూ ఆమెపై కొందరు విమర్శలు చేశారు. దాంతో పాటు పలువురు ఈ విషయమై లీగల్‌ గా వెళ్లాలనే సలహా తనూశ్రీకి ఇవ్వడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేవలం నానా పటేకర్‌ పై మాత్రమే కాకుండా ఆ చిత్ర యూనిట్‌ సభ్యులందరిపై కూడా ఫిర్యాదు చేయడం జరిగింది.

నానా పటేకర్‌ తో పాటు కొరియోగ్రాఫర్‌ గణేష్‌ ఆచార్య - నిర్మాత సమీ సిద్దిఖి - దర్శకుడు రాకేష్‌ సారంగ్‌ - ఇంకా ఎం ఎన్‌ ఎస్‌ కార్యకర్తలపై కూడా తనూశ్రీ దత్తా ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఎఫ్‌ ఐ ఆర్‌ సిద్దం చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి ఈ విషయం చిలికి చిలికి గాలి వానలా మారుతుందనిపిస్తుంది.

మరో వైపు నానా పటేకర్‌ మాత్రం తనూశ్రీ ఆరోపణలను మొదటి రోజు నుండే కొట్టి పారేస్తూ వస్తున్నాడు. ఆమెను తన కూతురులా భావించాను అంటూ నానా అంటున్నాడు. అబద్దంను ఎన్ని సార్లు అడిగినా కూడా అది అబద్దమే అవుతుందని ఈ సందర్బంగా నానా పటేకర్‌ మీడియా ముందు కాస్త అసహనం వ్యక్తం చేశాడు.