Begin typing your search above and press return to search.

టికెట్ రూ.20.. నిర్మాతకు రూ.3

By:  Tupaki Desk   |   22 Aug 2017 8:54 AM GMT
టికెట్ రూ.20.. నిర్మాతకు రూ.3
X
మాటలకు ముసుగేయకుండా.. ఏ విషయాన్నయినా ముక్కుసూటిగా.. ధైర్యంగా చెప్పే పెద్దాయన తమ్మారెడ్డి భరద్వాజ.. తెలుగు పరిశ్రమలో చెడు పోకడగల గురించి మరోసారి ఓపెన్ గా మాట్లాడారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రాకతో తెలుగు సినిమా పరిస్థితి ఎంత దుర్భరంగా మారిందో.. థియేటర్లు కొంతమంది గుప్పెట్లో పెట్టుకోవడంతో ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయో ‘అర్జున్ రెడ్డి’ ప్రి రిలీజ్ ఈవెంట్లో తమ్మారెడ్డి మొహమాటం లేకుండా చెప్పేశాడు. ఈ వేడుకలో ముందుగా విజయ్ దేవరకొండ బూతులతో ఓవరాక్షన్ చేయడం మీద సుతిమెత్తగా మందలించారు తమ్మారెడ్డి. విజయ్ కొంచెం ఎక్కువే చేశాడని ఆయనన్నారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో సమస్యల ప్రస్తావన తెచ్చారు.

జీఎస్టీ రాకతో పన్ను మోత పెరిగిందని.. సింగిల్ స్క్రీన్లలో 20 రూపాయల టికెట్ కూడా ఉంటుందని.. ఆ 20 రూపాయల్లో పన్నులు.. థియేటర్ మెయింటైనెన్స్ ఖర్చుకే రూ.17 రూపాయలు పోతాయని.. తిరిగి నిర్మాత చేతికి వచ్చేది కేవలం 3 రూపాయలని.. మరి ఆ మొత్తంతో నిర్మాత ఎలా బాగుపడతాడని ఆయన ప్రశ్నించారు. ‘అర్జున్ రెడ్డి’.. ‘పెళ్లి చూపులు’ సినిమాలకు మంచి క్రేజే వచ్చిందని.. కానీ ఈ అదృష్టం అన్ని సినిమాలకూ దక్కదని.. ఎన్నో మంచి సినిమాలు విడుదలకు నోచుకోకుండా ఆగిపోయిన పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాను సునీల్ నారంగ్ తీసుకోవడం వల్ల దర్శక నిర్మాతలు సేఫ్ అయిపోయారని.. లేదంటే ఈ చిత్రం విడుదలకే నోచుకునేది కాదని అన్నారు.

చిన్న సినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితి ఉందని.. మరి థియేటర్లు లేవా అంటే అదేమీ కాదని.. ఉన్నాయని.. కానీ అవి కొందరి చేతుల్లోనే ఉన్నాయని.. దాసరి నారాయణరావు గారుంటే ఆయన ఈ విషయాలపై గళం విప్పేవారని.. దురదృష్టవశాత్తూ ఆయన లేకపోవడంతో తాను మాట్లాడుతున్నానని అన్నారు తమ్మారెడ్డి. మొత్తం సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏమాత్రం బాగా లేదన్న తమ్మారెడ్డి.. ఇవి చాలవన్నట్లు సోషల్ మీడియాలో కొందరు.. బయట రాజకీయ నేతలు కూడా సినిమాను టార్గెట్ చేయడం.. రాళ్లేయడం అలవాటు చేసుకున్నారని తమ్మారెడ్డి ధ్వజమెత్తారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా 3 గంటలంట అని కామెంట్లు చేస్తున్నారని.. ఎన్ని గంటలుంటే మీకేంటని అన్నారు తమ్మారెడ్డి. అలాగే ఈ సినిమాలో ముద్దు సీన్లున్నాయని పోస్టర్లు చించేస్తున్నారని.. సినిమాకు జనాల్ని రప్పించడానికి ఏదో చేస్తారని.. మీకు ఇబ్బంది ఉంటే థియేటర్లకు రావొద్దని తేల్చి చెప్పారు తమ్మారెడ్డి.