Begin typing your search above and press return to search.

2022 మే తర్వాతే తెలుగు మూవీ అంటున్న తమిళ హీరో..!

By:  Tupaki Desk   |   7 July 2021 3:30 PM GMT
2022 మే తర్వాతే తెలుగు మూవీ అంటున్న తమిళ హీరో..!
X
కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ ఈ ఏడాది 'కర్ణన్' 'జగమే తంత్రం' సినిమాలను ప్రేక్షకులకు ముందుకు తీసుకురావడమే కాకుండా మరో ఐదు ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టారు. ఇప్పటికే 'అత్రాంగి రే' అనే హిందీ మూవీతో పాటుగా 'ది గ్రే మ్యాన్' అనే హాలీవుడ్ మూవీ షూటింగ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం కార్తీక్ నరేన్ దర్శకత్వంలో '#D43' చిత్రీకరణలో పాల్గొంటున్నాడు ధనుష్. ఇదే క్రమంలో తన సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో 'యుగానికొక్కడు 2'.. మిత్రన్ డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నాడు. ఇలా కోలీవుడ్ టూ హాలీవుడ్ వయా బాలీవుడ్ అంటూ బిజీబిజీగా గడుపుతున్న ధనుష్.. ఇప్పుడు స్ట్రెయిట్ తెలుగు సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెటున్నారు.

టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీకి ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌ పై నారాయణ్‌ దాస్‌ నారంగ్‌ - పి.రామ్మోహన్‌ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు తమిళం హిందీ భాషల్లో భారీ స్కేల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాదే ఈ క్రేజీ కాంబో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే లేటెస్టుగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నటించడానికి ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఉంటుందని టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తే ఈ ప్రాజెక్ట్స్ పై స్పష్టత వస్తుంది.

అయితే తమిళ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ధనుష్ ఈ ఏడాది తెలుగు సినిమాలు చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తున్న '#D43' 'యుగానికొక్కడు 2' సినిమాలు పుర్తయ్యాక తెలుగు సినిమాల వైపు అడుగులు వేయనున్నారట. 2022 లో తెలుగు ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు. శేఖర్ కమ్ముల సినిమా 2021లోనే ప్రారంభం అవుతుందని నిర్మాతలు ప్రకటించినా.. పరిస్థితులు చూస్తుంటే అది జరగడం కష్టమే అనిపిస్తోంది. ఇక సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సినిమా చేసేది నిజమే అయితే వచ్చే ఏడాది మే నెల తర్వాతే ఆ సినిమా పాజిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మధ్యలో ధనుష్ కు వేరే కథలు నచ్చి కొత్త ప్రాజెక్ట్స్ కమిట్ అయితే తెలుగు సినిమాలు మరింత లేట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఇకపోతే ధనుష్ స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తారో చూడాలి. చాలామంది తమిళ హీరోలు డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ లో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పరచుకున్నారు. విజ‌య్‌ - సూర్య - విక్ర‌మ్ - కార్తీ లతో పాటుగా ధనుష్ సినిమాలకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. శింబు - జీవా - శివ‌కార్తికేయ‌న్ వంటి వారు కూడా టాలీవుడ్ మార్కెట్ కోసం ఆ మధ్య ప్రయత్నాలు చేశారు. వీరిలో కొందరు మాత్రమే సఫలం అయ్యారు. అయితే స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో మెప్పించిన తమిళ హీరో మాత్రం కార్తీ ఒక్కరే అని చెప్పాలి.

ఇప్పుడు విజయ్ కూడా డైరెక్ట్ తెలుగు సినిమా చేయనున్నారు. దిల్ రాజు బ్యానర్ లో 'మహర్షి' ఫేమ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ ఓ సినిమాకి సైన్ చేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. ఈ క్రమంలో ధనుష్ కూడా విజయ్ బాటలోనే నడుస్తున్నారు. టాలీవుడ్ ఎంట్రీ కోసం శేఖర్ కమ్ముల ను ఎంచుకున్నారు. త్వరలోనే సూర్య కూడా తెలుగు సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. బోయపాటి శ్రీను దర్శకుడిగా సూర్య తో దిల్ రాజు ఓ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నారని అంటున్నారు. మరి కార్తీ మాదిరిగా వీళ్ళందరూ తెలుగులో సత్తా చాటుతారేమో చూడాలి.