Begin typing your search above and press return to search.

దీపావళికి తమిళ హీరోల సినిమాలతోనే సరిపెట్టుకోవాలా..?

By:  Tupaki Desk   |   20 Sep 2022 6:03 AM GMT
దీపావళికి తమిళ హీరోల సినిమాలతోనే సరిపెట్టుకోవాలా..?
X
టాలీవుడ్ లో 'గాడ్ ఫాదర్' - 'ది ఘోస్ట్' మరియు 'స్వాతిముత్యం' వంటి సినిమాలు దసరా సీజన్ లో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. అంతకంటే వారం ముందు 'పొన్నియన్ సెల్వన్ 1' మరియు 'నేనే వస్తున్నా' వంటి రెండు తమిళ డబ్బింగ్ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. అయితే ఆ తర్వాత వచ్చే దీపావళి పండక్కి ఏయే సినిమాలు వస్తాయనేది తెలియడం లేదు.

ఇప్పటి వరకు తెలుగులో ఏ సినిమా కూడా దీపావళి సందర్భంగా అక్టోబర్ నెలాఖరున రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించలేదు. కానీ ఇద్దరు తమిళ హీరోలు ఈసారి ఆల్రెడీ పండుగ మీద కర్చీఫ్ వేసుకున్నారు. వాళ్ళెవరో కాదు.. డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకున్న కార్తీ మరియు శివ కార్తికేయన్.

కార్తీ ప్రధాన పాత్రలో నటించిన స్పై క్రైమ్ థ్రిల్లర్ ''సర్దార్'' రిలీజ్ కు రెడీ అయింది. పీఎస్ మిత్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కార్తీ డ్యూయెల్ రోల్ లో కనిపించనుండగా.. రాశీ ఖన్నా - రాజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు.

టాలీవుడ్ లో కార్తీకి ఉన్న క్రేజ్ ని దృష్టి లో పెట్టుకుని.. ఈ సినిమా తెలుగు థియేటర్ హక్కులను అక్కినేని నాగార్జున తీసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీదుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున 'సర్దార్' సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీపావళికి రిలీజ్ అని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

మరోవైపు శివ కార్తికేయన్ నటించిన తాజా చిత్రం "ప్రిన్స్" కూడా అదే రోజున థియేటర్లలోకి రాబోతోంది. ఇది టాలెంటెడ్ హీరోకి తెలుగు డెబ్యూ. 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ కేవీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ సునీల్ నారంగ్ - పుస్కుర్ రామ్ మోహన్ రావు మరియు డి. సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇలా 2022 దీపావళికి ఇద్దరు కోలీవుడ్ హీరోల సినిమాలు తమిళంతో పాటుగా తెలుగులోనూ సందడి చేయబోతున్నాయి. సాధారణంగా టాలీవుడ్ మేకర్స్ దీపావళిని డ్రై సీజన్ గా భావిస్తుంటారు. ఈ సమయంలో విడుదల చేసే సినిమాలు ఆశించిన విజయాన్ని అందించవని నమ్ముతారు. అందుకే ఈ డేట్స్ కోసం పోటీ పడలేదని భావించవచ్చు.

కాకపోతే డిసెంబర్ మొదటి వారం నుంచి వచ్చే సంక్రాంతి వరకూ విడుదల తేదీలను లాక్ చేసుకోడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. డిసెంబర్ 2న అడివి శేష్ 'హిట్ 2' తో పాటుగా మైత్రీ మూవీ మేకర్స్ లో నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. వీటికి పోటీగా ధనుష్ స్ట్రెయిట్ తెలుగు చిత్రం 'సార్' కూడా రాబోతోంది.

సంక్రాంతి కి చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' మరియు ప్రభాస్ 'ఆది పురుష్' సినిమాలు ఫిక్స్ అయ్యాయి. మధ్యలో క్రిస్మస్ సీజన్ లో వచ్చే చిత్రాలపై క్లారిటీ రావాల్సి ఉంది. మైత్రీలో రూపొందే బాలకృష్ణ NBK107 మరియు విజయ్ దేవరకొండ - సమంతల 'ఖుషి' చిత్రాల్లో ఒకటి రావొచ్చని అంటున్నారు. అఖిల్ అక్కినేని 'ఏజెంట్' కూడా విడుదల తేదీ కోసం చూస్తోంది. త్వరలోనే వీటిపై స్పష్టత వస్తుందేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.