Begin typing your search above and press return to search.

అడ్వాన్స్ బుకింగ్స్ లో సర్కారు వారి దూకుడు..!

By:  Tupaki Desk   |   10 May 2022 6:30 AM GMT
అడ్వాన్స్ బుకింగ్స్ లో సర్కారు వారి దూకుడు..!
X
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ''సర్కారు వారి పాట'' సినిమా అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈ శుక్రవారం (మే 12) ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో టికెట్ అడ్వాన్స్ బుకింగ్స్ లో మహేష్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

యాక్షన్‌ - యాక్షన్ తో కూడిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ గా పేర్కొనబడిన SVP సినిమా టిక్కెట్స్ ముందుగానే బుక్ చేసుకోడానికి మహేష్ అభిమానులు ఎగబడుతున్నారు. ప్రామిసింగ్ ట్రైలర్ - టీజర్ మరియు చార్ట్‌ బస్టర్ సాంగ్స్ ఈ చిత్రానికి భారీ బజ్‌ ని తెచ్చిపెట్టాయి. ఈ సినిమా కోసం అందరూ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనేది అడ్వాన్స్ బుకింగ్స్‌ లో ప్రతిబింబిస్తోంది.

ఇప్పటికే 'సర్కార్ వారి పాట' యూఎస్ఏ ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ లో దూసుకుపోతోంది. సోమవారానికి 362 లొకేషన్స్ లో 1046 షోల ద్వారా 448K డాలర్లు వసూలు చేసింది. దేశీయ మార్కెట్‌ తో పాటు ఓవర్సీస్‌ లోనూ మహేష్‌ కు మంచి మార్కెట్‌ ఉంది. మే 11న ప్రీమియర్స్ పడనున్న నేపథ్యంలో.. ఈ రెండు రోజుల్లో ఆ నంబర్ డబుల్ అయ్యే అవకాశం ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి టికెట్ రేట్లు పెంచుకోడానికి ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. అదేవిధంగా 5 షోలు వేయడానికి పర్మిషన్ ఇచ్చింది. దీంతో పెంచిన ధరలతో సోమవారం అన్ని ప్రధాన ఏరియాలలో అడ్వాన్స్ బుకింగ్స్ తెరవబడ్డాయి.

రెండున్నరేళ్ల తర్వాత మహేష్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో.. సూపర్ స్టార్ అభిమానులు టికెట్ల కోసం ఎగబడ్డారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన కొన్ని నిమిషాల్లోనే హౌస్ ఫుల్స్ చూపించే పరిస్థితి ఏర్పడేలా చేశారు. ముఖ్యంగా నైజాంలో సర్కారు వారి సందడి ఎక్కువగా కనిపిస్తోంది.

హైదరాబాద్ లో 'సర్కారు వారి పాట' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే 2.55 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. అందులో 58 నిమిషాల్లోనే 1 కోటి మార్క్ గ్రాస్ వసూలు చేయడం విశేషం. ఇటీవల రిలీజ్ అయిన చిత్రాల్లో 'రాదేశ్యామ్' (1 రోజు) - 'ఆచార్య' (2 రోజులు) - 'భీమ్లా నాయక్' (3 రోజులు) కోటి గ్రాస్ అందుకున్నాయి.

సౌత్ లో 'RRR' - 'KGF: చాప్టర్ 2' తర్వాత 'సర్కారు వారి పాట' చిత్రానికి అదే తరహా క్రేజ్‌ కనిపిస్తోంది. సినిమా రిలీజ్ కు ఇంకా రెండు రోజుల సమయం ఉంది కాబట్టి.. అడ్వాన్స్ బుకింగ్స్ లో సర్కారు వారి హవా కనిపించే అవకాశం ఉంది. తెలుగులో సోలోగా విడుదల అవుతుండటం.. నాలుగు రోజుల వీకెండ్ SVP సినిమాకు అదనపు ప్రయోజనమని చెప్పాలి.

ఈ నేపథ్యంలో 'సర్కారు వారి పాట' మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకోబోయే సినిమా అవుతుందని అంచనా వేయొచ్చు. పరశురాం పెట్లా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేశ్ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటించింది. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి చార్ట్ బస్టర్ ఆల్బమ్ అందించారు.

మైత్రీ మూవీ మేకర్స్ - జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ మరియు 14 రీల్స్ బ్యానర్లు సంయుక్తంగా SVP సినిమాని నిర్మిస్తున్నాయి. నవీన్ యెర్నేని - వై. రవిశంకర్ - రామ్ ఆచంట - గోపీచంద్ ఆచంట నిర్మాతలు. ఆర్. మది సినిమాటోగ్రఫీ అందించగా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించగా.. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ నిర్వహించారు.