Begin typing your search above and press return to search.

ధోని 2.0.. అత్యాశ కాదూ?

By:  Tupaki Desk   |   5 July 2018 5:49 AM GMT
ధోని 2.0.. అత్యాశ కాదూ?
X
‘బాగ్ మిల్కా బాగ్’ మొదలుకుని ‘ఎం.ఎస్.ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’ వరకు గత దశాబ్ద కాలంలో బాలీవుడ్లో చాలానే స్పోర్ట్స్ బయోపిక్స్ వచ్చాయి. అందులో అతి పెద్ద విజయం సాధించిన సినిమా ధోనీదే. స్టార్ హీరోలు నటించే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దీటుగా ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. ధోని మీద జనాల్లో ఉన్న అభిమానం ఎలాంటిదో ఈ సినిమా రుజువు చేసింది. అతడి కథను నీరజ్ పాండే చాలా హృద్యంగా తెరకెక్కిస్తే.. సుశాంత్ రాజ్ పుత్ ఆ పాత్రను అద్భుత రీతిలో పోషించి మెప్పించాడు. ఐతే బయోపిక్ ఏదైనా ఒక్క భాగంతో అయిపోతుంది. ఇక దానికి కొనసాగింపంటూ ఉండదు. కానీ ధోని సినిమాను మాత్రం కొనసాగించబోతున్నారట. దీనికి సీక్వెల్ కూడా రాబోతోందట. ‘ధోని 2.0’ పేరుతో కొత్త సినిమా చేయబోతున్నట్లు హీరో సుశాంత్ సింగ్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

‘ఎం.ఎస్.ధోని’లో మహి చిన్నతనం నుంచి అతను 2011 ప్రపంచకప్ లో భారత్ ను విజేతగా నిలబెట్టే వరకు అంతా చూపించారు. దాదాపుగా అతడి జీవితంలోని కీలక ఘట్టాలన్నీ అందులో వచ్చేశాయి. 2011 ప్రపంచకప్ గెలవడం కంటే ధోని జీవితంలో హై మూమెంట్ ఇంకేమీ ఉండదు. దాని తర్వాత ధోని కెరీర్ మామూలుగానే సాగింది. మధ్యలో టెస్టులకు రిటైర్మెంట్ ఇవ్వడం తప్ప ఇంకే విశేషం ఏమీ లేదు. అతడింకా వన్డేలు.. టీ20ల్లో కొనసాగుతూనే ఉన్నాడు. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూతురు పుట్టడం తప్ప చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. అలాంటపుడు ‘ధోని 2.0’లో చూపించడానికి ఏముందన్నది సందేహం. ఇప్పుడీ సీక్వెల్ ప్రకటించడం చూస్తే.. తొలి భాగానికి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో క్రేజ్ ను క్యాష్ చేసుకోవడం లాగే కనిపిస్తోంది. దీన్ని అత్యాశగా పేర్కొంటున్నారు చాలామంది. అసలింతకీ ఈ చిత్రానికి నీరజ్ పాండేనే దర్శకత్వం వహిస్తాడా లేదా అన్నది కూడా చూడాలి. అలాంటి మేటి దర్శకుడు ఇలాంటి ప్రయత్నం చేస్తాడా అన్నది సందేహమే.