Begin typing your search above and press return to search.

ఈ-కామర్స్ సైట్స్ పై సుశాంత్ ఫ్యాన్స్ ఆగ్రహం.. కారణమేంటంటే..?

By:  Tupaki Desk   |   28 July 2022 7:49 AM GMT
ఈ-కామర్స్ సైట్స్ పై సుశాంత్ ఫ్యాన్స్ ఆగ్రహం.. కారణమేంటంటే..?
X
ప్రముఖ ఈ-కామర్స్ సైట్స్ ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్.. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ ఫొటోని ప్రింట్ చేసిన టీ-షర్ట్స్ ని విక్రయించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనిపై సుశాంత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది #BoycottFlipkart #BoycottAmazon అని ట్విట్టర్ లో ట్రెండ్ చేసే వరకూ వెళ్ళింది.

టీ-షర్ట్‌ పై సుశాంత్ రాజ్ పుత్ ఫోటోని ముద్రించి అమ్మడంపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు. కాకపోతే ఇక్కడ సుశాంత్‌ ఆర్ట్‌ వర్క్‌ తో పాటు పాటు "డిప్రెషన్ ఈజ్‌ డ్రోయింగ్‌" అనే ట్యాగ్‌ లైన్‌ తో ప్రింట్ చేసి అమ్ముతున్నారు. ఇదే ఇప్పుడు కాంట్రవర్సీకి తెర తీసింది.

ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ లలో ఈ టీ-షర్ట్స్ ని సేల్ కి ఉంచారు. ఈ-కామర్స్ సైట్స్ లో ఇలాంటి టీ-షర్ట్స్ అమ్ముతున్నారని గుర్తించిన సుశాంత్ ఫ్యాన్స్.. వారిపై ఫైర్ అవుతున్నారు. రెండు ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీలను బాయ్‌ కాట్ చేయాలంటూ ట్విట్టర్‌ లో పోస్టులు పెడుతున్నారు.

ఈ మేరకు హ్యాష్ ట్యాగ్స్ సృష్టించి సోషల్ మీడియాలో నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. సుశాంత్ ఫోటో ఉన్న టీ-షర్ట్స్ స్క్రీన్ షాట్స్ తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వెంటనే అన్ని ఈ-కామర్స్ సైట్‌ నుంచి ఆ టీ షర్ట్‌ లని తొలగించాలని.. దివంగత నటుడికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

దేశంలోని అతిపెద్ద ఈ-కామర్స్ ప్లాట్‌ ఫామ్స్ గా ఉండి.. తమ వ్యాపారం కోసం ఇంతకి దిగజారుతారా అని నెటిజన్లు మండిపడుతున్నారు. చనిపోయిన వ్యక్తి ఫోటోను టీ-షర్ట్‌ పై ముద్రించి అలాంటి కోట్‌ ను యాడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆ టీ షర్ట్స్ వెబ్‌ సైట్‌ లో అందుబాటులో లేదు. కానీ అప్పటికే స్క్రీన్ షాట్స్ తీసిన నెటిజన్లు వైరల్ చేశారు.

కాగా, బాలీవుడ్‌ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ 2020 జూన్ 14న ముంబై బాంద్రాలోని తన ఫ్లాట్ లో ఉరివేసుకున్న స్థితిలో కన్నుమూశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుశాంత్ మరణం కేసు.. రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.

నెపోటిజం కారణంగా అవకాశాలు రాకుండా చేసి డిప్రెషన్ తో ఆత్మహత్యకు పాల్పడేలా చేసారని ఫ్యాన్స్‌ ఆరోపించారు. అదే సమయంలో సుశాంత్ మరణంపై అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు ఆసక్తికరమైన మలుపు తిరిగింది. నటుడి మృతిపై సీబీఐ వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టింది.

టీవీ ఆర్టిస్ట్‌ గా కెరీర్‌ ప్రారంభించిన సుశాంత్.. 'కై పో చెయ్' సినిమాతో బాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 'శుద్ధ్ దేశీ రొమాన్స్' చిత్రంతో సక్సెస్ అందుకొని.. 'ఎంఎస్ ధోని - ది అన్ టోల్డ్ స్టోరీ' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 'పీకే' 'డిటెక్టీవ్ బ్యోమకేష్ భక్షీ' 'సొంచీరియా' 'కేదార్ నాథ్' 'చిచోరె' సినిమాలతో మెప్పించాడు. అతని చివరి సినిమా 'దిల్ బేచారా' ప్రేక్షకుల ముందుకు రాకముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

ఇకపోతే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానంతరం పాట్నాలోని అతని నివాసం స్మారక చిహ్నంగా మార్చబడింది. దివంగత నటుడి టెలిస్కోప్ - పుస్తకాలు - గిటార్ మరియు ఇతర వ్యక్తిగత వస్తువులతో పాటుగా అతను నటించిన సినిమాలకు సంబంధించిన విషయాలను అక్కడ ఉంచారు.