Begin typing your search above and press return to search.

70 కోట్ల అప్పు ఉంది.. ఇంకేం చెయ్యమంటారు!

By:  Tupaki Desk   |   17 May 2020 6:36 AM GMT
70 కోట్ల అప్పు ఉంది.. ఇంకేం చెయ్యమంటారు!
X
కరోనా క్రైసిస్ ఇప్పటికే పలు రంగాలలో చాలా మార్పులను తీసుకొచ్చింది. కొన్ని రంగాలలో ఈ మార్పులు కనిపిస్తున్నాయి. సినీ రంగమే తీసుకుంటే సినిమాల విడుదల స్వరూపమే పూర్తిగా మారిపోతోంది. గతంలో డైరెక్ట్ థియేటర్ రిలీజ్ తప్ప నిర్మాతలకు మరొక ఆప్షన్ లేదు.. దీంతో థియేటర్ల కోసం డిమాండ్ ఎక్కువగా ఉండేది. కొన్ని సినిమాలు మంచి డేట్ కోసం.. ఎక్కువ థియేటర్ల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఓటీటీ వేదికల ద్వారా రిలీజ్ చేసుకునే ఆప్షన్ దొరకడం.. తమ పెట్టుబడిని రికవరీ చేసుకునే అవకాశం ఉండడంతో కొందరు నిర్మాతలు ఓటీటీలలో డైరెక్ట్ రిలీజుకు మొగ్గు చూపుతున్నారు. ఈమధ్య తమిళ నాట సూర్య కూడా ఇలానే చేయడానికి సిద్ధపడడం చర్చనీయాంశం అయింది.

సూర్య నిర్మాతగా తెరకెక్కించిన 'పొన్ మగళ్ వందాల్' సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తామని సూర్య ప్రకటించడంతో థియేటర్ల ఓనర్లు భగ్గుమన్నారు. ఇలా చేస్తే సూర్య నటించిన సినిమాలు అన్నీ బాయ్ కాట్ చేస్తామని.. థియేటర్లలో రిలీజ్ కానివ్వమని హెచ్చరించారు. సూర్య నటించిన 'సూరరై పొట్రు' త్వరలో రిలీజుకు రెడీ అవుతోంది. ఆ సినిమాపై ఎఫెక్ట్ పడుతుందని అందరూ భావించారు. అయితే సూర్య మాత్రం తను అనుకున్నట్టే 'పొన్ మగళ్ వందాల్' సినిమాను ఓటీటీ రిలీజ్ చేస్తానని ప్రకటించారు.

తనకు రూ. 70 కోట్లు అప్పు ఉందని.. సినిమాను రిలీజ్ చేసుకోకుండా ఇంకేం చేయాలని ప్రశ్నించారు. "నా సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు ఎవరైనా హెల్ప్ చేశారా? నాబిజినెస్ నేను చేసుకుంటా. సినిమా హిట్ అయినప్పుడు ఓవర్ ఫ్లో కూడా ఎగ్గొట్టే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ నన్ను ప్రశ్నించడం కామెడీగా ఉంది. నేను ప్రొడ్యూస్ చేసే సినిమాలను ఇకపై ఓటీటీలోనే రిలీజ్ చేస్తాను. వాటికి తగ్గట్టుగానే నా సినిమాల బడ్జెట్ ఉంటుంది" అంటూ తేల్చి చెప్పాడు. డబ్బు ఖర్చు పెట్టే నిర్మాతకు తెలుస్తుంది కష్టం.. పెట్టుబడిని రాబట్టుకోవడానికి మార్గాలు వెతుక్కోవడంలో తప్పేముంది? గట్టున కూర్చున్న వాడు ఎన్నైనా నరేషన్లు అయినా ఇస్తాడు. వారేమైనా నిర్మాతల డబ్బుకు హామీ ఇస్తారా?