Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: సేఫ్ గేమ్ ఆడ‌డంలో దొందూ దొందే!

By:  Tupaki Desk   |   10 Aug 2021 12:30 AM GMT
ట్రెండీ టాక్‌: సేఫ్ గేమ్ ఆడ‌డంలో దొందూ దొందే!
X
2020 -2021 బ్యాడ్ సీజ‌న్ గా మారింది. క‌రోనా మ‌హ‌మ్మారీ ఇప్ప‌టికి రెండు సార్లు వెంటాడింది. సెకండ్ వేవ్ ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసింది. ల‌క్ష‌ల్లో మ‌ర‌ణాలు క‌ల‌వ‌ర‌పెట్టాయి. మొత్తానికి క‌రోనా చాలా రంగాల‌కు పాఠాలు నేర్పింది. ముఖ్యంగా సినీరంగానికి ఎంతో నేర్పించింది. ఇక సినిమాల వీక్ష‌ణ తీరుతెన్నుల‌ను క‌రోనా మార్చేసింది. ఇప్పుడు ఓటీటీల‌దే హ‌వా. థియేట‌ర్లు తెరిచినా ఓటీటీల‌కు ఎదురు లేద‌ని ప్రూవ్ అవుతోంది.

ఇక 2020లో మ‌హ‌మ్మారీ ఓ ఊపు ఊపుతున్న స‌మ‌యంలో త‌మ సినిమాల్ని ఎలా అమ్ముకోవాలో తెలియ‌క నిర్మాత‌లంతా క‌న్ఫ్యూజ్ అయ్యారు. అలాంటి స‌మ‌యంలో డేర్ చేసి ఓటీటీ ల‌కు త‌న సినిమాల్ని విక్ర‌యించి హాట్ టాపిక్ అయ్యారు త‌మిళ హీరో కం నిర్మాత సూర్య‌. పంపిణీదారులు ఎగ్జిబిట‌ర్ల నుండి విమర్శలను ఎదుర్కొన్నా.. దేనినీ ఖాత‌రు చేయ‌క సూర్య నిర్మాత కోణంలో ఆలోచించారు. స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోకు తన ప్రొడక్షన్ వెంచర్ లను విక్ర‌యించారు. గత సంవత్సరం అతను తాను నిర్మించిన‌ పొన్మగల్ వంధాల్ - సూరరాయ్ పొట్రూ (ఆకాశం నీ హ‌ద్దురా) చిత్రాల‌కు నేరుగా OTT విడుదలను ఎంచుకున్నాడు. వీటిలో ఆకాశం నీ హ‌ద్దురా ఓటీటీలో సంచలన విజయం సాధించింది.

ఓటీటీ మార్గాన్ని ఎంచుకున్న తొలి నిర్మాత సింగం సూర్య‌. ఆ త‌ర్వాత అత‌డిని ప‌లువురు అనుస‌రించారు. ఇప్పుడు గత కొన్ని రోజులుగా నిర్మాత సురేష్ బాబు తన సినిమాలను OTT వేదిక‌పై డైరెక్ట్ విడుదల కు త‌న సినిమాల‌ను విక్రయించారు. నారప్ప అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ చేశారు. త‌దుప‌రి దృశ్యం 2 -విరాటప‌ర్వం ఇతర OTT ప్లాట్ ఫారమ్ లకు విక్రయించార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. థియేటర్లను తిరిగి తెరవడానికి సమయం పట్టవచ్చని అవి తిరిగి తెరిచినా లాభాలు తేవ‌డం గ‌గ‌నం అని సురేష్ బాబు విశ్లేషించారు. ఏపీలో టిక్కెట్టు ధ‌రల‌తో గిట్టుబాటు కాద‌ని ఓ నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన ఆయ‌న ఓటీటీ మార్గ‌మే బెట‌ర్ అని భావించారు. ఇప్ప‌టి స్థితిలో చాలా నెలలు ఆక్యుపెన్సీపై చాలా ఆంక్షలు ఉంటాయని సురేష్ బాబు గ్రహించారు. అంతేకాకుండా కరోనావైరస్ మూడవ వేవ్ భయం కూడా అలానే ఉంది. మ‌రో ఆరేడు నెల‌ల స‌మ‌యం ఇలానే ఉంటే థియేట్రిక‌ల్ రిలీజ్ తో ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని సురేష్ బాబు విశ్లేషిస్తున్నారు. అందుకే ఓటీటీల‌కు త‌న‌ సినిమాలను విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఓవైపు పంపిణీ వ‌ర్గాలు ఎగ్జిబిట‌ర్లు సురేష్ బాబు ప‌నిని తీవ్రంగా ఖండిస్తున్నారు. బ్యాన్ విధిస్తామ‌ని తెలంగాణ ఛాంబ‌ర్ హెచ్చ‌రించినా ఆయ‌న ప‌ట్టించుకోలేదు. సూర్య బాట‌లోనే సురేష్ బాబు కూడా డేర్ చేసి ఓటీటీల్లో రిలీజ్ కి వెళుతున్నారు.

2021లోనూ సూర్య కూడా ఓటీటీల‌తో భారీ డీల్స్ కుదుర్చుకున్నార‌ని తెలిసింది. ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్ వీడియోతో మరో అద్భుతమైన ఒప్పందాన్ని చేసుకున్నాడు. సెప్టెంబర్ నుండి ప్రారంభించి నెలకు ఒక చిత్రం చొప్పున ప్రైమ్ వీడియోస్ లో విడుదల చేస్తున్నార‌ట‌. ఈ సినిమాలన్నీ 2 డి ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై ఆయన నిర్మించారు. సెప్టెంబర్ లో `రామె ఆండలం రావణే ఆండలం` స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. ఇది ఉదన్ పిరప్పే- జై భీమ్- ఓహ్ మై డాగ్ వరుసగా అక్టోబర్- నవంబర్ - డిసెంబర్ లో విడుదల కానున్నాయి. ఇవ‌న్నీ సూర్య ప్ర‌యోగాత్మ‌క కంటెంట్ తో నిర్మించిన‌వి.

జై భీమ్ చిత్రంలో సూర్య ప్రధాన పాత్రలో నటించారు. థియేటర్లను తిరిగి తెరవడం ఇప్ప‌ట్లో సందిగ్ధ‌మే కాబ‌ట్టి సూర్య OTT ల‌కు విక్రయించార‌ని తెలిసింది. ఒక నిర్మాత‌గా సేఫ్ జోన్ లో ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. సూర్య‌.. సురేష్ బాబు త‌ర్వాత అల్లు అర‌వింద్ .. దిల్ రాజు వంటి వారు కొన్ని ఓటీటీ ఒప్పందాల కోసం స‌న్నాహకాల్లో ఉన్నార‌న్న ప్ర‌చారం సాగుతోంది.