Begin typing your search above and press return to search.

బోల్డ్ నిర్మాత‌ ఏక్తా క‌పూర్ కి సుప్రీం చీవాట్లు..!

By:  Tupaki Desk   |   15 Oct 2022 4:06 AM GMT
బోల్డ్ నిర్మాత‌ ఏక్తా క‌పూర్ కి సుప్రీం చీవాట్లు..!
X
తన వెబ్ సిరీస్ XXX లో అభ్యంతరకరమైన కంటెంట్ పై నిర్మాత ఏక్తా కపూర్ ను సుప్రీంకోర్టు శుక్రవారం తప్పుపట్టింది. పాపుల‌ర్ మ‌హిళా నిర్మాత‌ ఏక్తా నిర్మించిన వెబ్ సిరీస్ XXXలో అభ్యంతరకరమైన కంటెంట్ తో యువకుల మనస్సులను కలుషితం చేస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయమూర్తుల బెంచ్ అజయ్ రస్తోగి - సి టి రవికుమార్ మాట్లాడుతూ "ఏదో ఒకటి చేయాలి. మీరు ఈ దేశంలోని యువతరం మనస్సులను కలుషితం చేస్తున్నారు. OTT (ఓవర్ ది టాప్) కంటెంట్ అందరికీ అందుబాటులో ఉంది. మీరు ప్రజలకు ఎలాంటి ఎంపికను అందిస్తున్నారు?" అని ప్ర‌శ్నించారు. ఈ కోర్టు గొంతు ఉన్న వారి కోసం కాదు... ఈ కోర్టు గొంతు లేని వారి కోసం పనిచేస్తుందని బెంచ్ వ్యాఖ్యానించింది.

ఏక్తాక‌పూర్ తన వెబ్ సిరీస్ XXX లో అభ్యంతరకరమైన కంటెంట్ ఆరోప‌ణ‌ల‌పై జారీ చేసిన అరెస్ట్ వారెంట్ లను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత బెంచ్ కీల‌క వ్యాఖ్యలు చేసింది. తన OTT ప్లాట్‌ఫారమ్ ALT బాలాజీలో ప్రసారమైన వెబ్ సిరీస్ లో సైనికులను అవమానించడం స‌హా వారి కుటుంబాల మనోభావాలను దెబ్బతీసేలా చూపార‌ని ఏక్తా కపూర్ పై మాజీ సైనికుడు శంభు కుమార్ ఫిర్యాదు చేశారు. బీహార్ లోని బెగుసరాయ్ లోని ట్రయల్ కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. కపూర్ తరపున‌ న్యాయవాది అత్యున్నత న్యాయస్థానంలో మాట్లాడుతూ అరెస్ట్ వారెంట్ లకు వ్యతిరేకంగా పాట్నా హైకోర్టులో ఈ అంశం పెండింగ్ లో ఉందని అయితే ఈ విషయం త్వరలో విచారణకు లిస్టింగ్ అవుతుందనే ఆశ లేదని అన్నారు.

డ‌ర్టీ పిక్చ‌ర్ కి ప‌ద్మ‌శ్రీ ఎలా ఇచ్చారు?

ఆమె ఎంపిక‌లే బోల్డ్ అండ్ నాటీ..! పెద్ద తెర‌పై క‌మ‌ర్షియ‌ల్ గా కాసుల వ‌ర్షం కుర‌వాల్సిందే. న్యూడిటీ లేనిదే ఆమె సినిమాలు తీయ‌దు. అయితే అందుకు భిన్నంగా టీవీ రంగంలో ఎంద‌రికో ఉపాధిని క‌ల్పిస్తూ సేవ‌లందిస్తున్నారు. క‌ళాకారుల‌కు అవ‌కాశాలు క‌ల్పిస్తున్నారు. ఎంచుకున్న రంగంలో నిజాయితీగా సేవ‌లు చేసినందుకు చాలా గౌర‌వం ద‌క్కుతోంది. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఏక్తా కపూర్ ఇంత‌కుముందు ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును అందుకుంది.

2021 నవంబరు 8న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రదర్శన కళల రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు నిర్మాత ఏక్తా కపూర్ ప్రతిష్టాత్మక నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ తో సత్కరించారు. టెలివిజన్- చలనచిత్రాలు - డిజిటల్ కంటెంట్ రంగంలో ఆమె అద్భుతమైన సహకారం అందించినందుకు కపూర్ ను సత్కరించారు. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ రంగంలో ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును అందుకుంటున్న ఫోటోలు వైర‌ల్ గా మారాయి.

ఆ స‌మ‌యంలో ఏక్తా ఇలా అన్నారు. "నేను ఎల్లప్పుడూ రొటీనిటీని వ‌దిలేయాల‌ని నిబంధనలను సవాలు చేయాలని.. ప్రతిభావంతులకు నిజంగా అర్హత‌మేర‌ వేదికను ఇవ్వాలని.. గర్వాన్ని కలిగించాలని.. ఆశ‌ప‌డ్డాను. నా ఆశయం కలలకు ఆజ్యం పోసిన దేశానికి తిరిగి ప్ర‌తిదీ ఇవ్వాలని ఆశిస్తున్నాను" అని అన్నారు.

ఏక్తా కపూర్ అభిమానులు ప్రేక్షకులు నిర్మాతగా ఆమె ఎదుగుదలను ఇష్టపడ్డారు. ప్రారంభం నుండి ఆమె అద్భుతాలు చేశారు. అమితాబ్ బచ్చన్ - కరీనా కపూర్ ఖాన్- కార్తీక్ ఆర్యన్- జాన్ అబ్రహం- అర్జున్ కపూర్- దిశా పటానీ- తారా సుతారియా వంటి అనేక మందితో ఆమె వ‌రుస ప్రాజెక్ట్ లను నిర్మిస్తున్నారు. 2021-2022 మధ్య పెద్ద స్టార్ల‌తో సినిమాలు చేస్తున్నారు. ఆమెకు టన్నుల కొద్దీ ప్ర‌ణాళిక‌లు ఉన్నాయి, అద్భుత విజ‌యాల‌ను అందుకుంటూ ఏక్తా తన కీర్తి కిరీటంలో మైలురాళ్లు అందుకుంటోంది. ఇలాంటి స‌మ‌యంలో కోర్టు కేసుల‌ను అంతే ధీటుగా ఎదుర్కొంటోంది. యువ‌త‌ను చెడు దారి ప‌ట్టించ‌డం స‌రికాద‌న్న‌ది సుప్రీం ప్ర‌శ్న‌. మ‌రి దీనికి ఏక్తా ఎలాంటి స‌మాధాన‌మిస్తుందో?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.