Begin typing your search above and press return to search.

కొత్త కుర్రాళ్లకు ఛాన్స్ ఇస్తున్న సూపర్ స్టార్

By:  Tupaki Desk   |   11 Jan 2021 11:30 PM GMT
కొత్త కుర్రాళ్లకు ఛాన్స్ ఇస్తున్న సూపర్ స్టార్
X
మహేశ్ బాబు రూట్ మార్చేశాడు .. ఆల్రెడీ తనకి ఒక హిట్ ఇచ్చిన దర్శకులే మరో హిట్టు ఇవ్వగలరనే ఆలోచనా విధానానికి ఆయన ఫుల్ స్టాప్ పెట్టేశాడు. సీనియర్ డైరెక్టర్లకు మాత్రమే తన బాడీ లాంగ్వేజ్ అర్థమవుతుందనీ, వాళ్లే తనకి తగిన కథలను రెడీ చేయగలరని ఇంతకాలంగా మహేశ్ బాబూ అనుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. యువ దర్శకులు కొత్త ఆలోచనలతో .. కథను కొత్తగా ప్రెజెంట్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ కారణంగానే రజనీకాంత్ వంటి సీనియర్ స్టార్ హీరోలే, యువ దర్శకులకు అవకాశాలు ఇస్తూ వెళుతున్నారు.


ఈ నేపథ్యంలో మహేశ్ బాబు కూడా యువ దర్శకులు చెప్పే కథలు వినడం .. నచ్చిన కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళ్లడం మొదలుపెట్టాడు. యువ దర్శకులపై నమ్మకంతో వాళ్లు చెప్పినట్టుగా ఫాలో అవుతున్నారు. అలా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా చేసిన ఆయన, తన కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టుకోగలిగాడు. ఆ తరువాత గట్టిగా 'గీత గోవిందం' మాత్రమే చేసిన పరశురామ్ కి అవకాశం ఇచ్చి, 'సర్కారువారి పాట' చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగు మొదలుకానుంది.


ఈ నేపథ్యంలోనే ఆయన వెంకీ కుడుముల దర్శకత్వంలోను ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 'ఛలో' .. 'భీష్మ' వంటి హిట్ సినిమాలతో దర్శకుడిగా వెంకీ కుడుముల తన సత్తా చాటుకున్నాడు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి వెంకీ కుడుముల రీసెంట్ గా మహేశ్ బాబును కలిసి ఒక కథ వినిపించగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. 'సర్కారువారి పాట' తరువాత ఈ ప్రాజెక్టునే మహేశ్ పట్టాలెక్కించనున్నాడని చెబుతున్నారు. అదే నిజమైతే దర్శకుడిగా వెంకీ కుడుముల మరోమెట్టు ఎక్కేసినట్టే!