Begin typing your search above and press return to search.

పుష్పలో వారి పాత్ర పై ఆసక్తి

By:  Tupaki Desk   |   6 Aug 2020 9:10 AM GMT
పుష్పలో వారి పాత్ర పై ఆసక్తి
X
అల వైకుంఠపురంలో చిత్రంతో ఈ ఏడాది బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ సాధించడంతో పాటు ఇండస్ట్రీ హిట్‌ ను కూడా దక్కించుకున్న అల్లు అర్జున్‌ తదుపరి చిత్రాన్ని సుకుమార్‌ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమా కన్ఫర్మ్‌ అయ్యి ఏడాదికి పైగా అవుతున్నా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు కరోనా కారణంగా షూటింగ్‌ ఆరంభంకు ముందే నిలిచి పోయింది. కరోనా లాక్‌ డౌన్‌ టైమ్‌ లోనే పుష్ప చిత్రంకు సంబంధించిన లుక్‌ విడుదల చేశారు. ఎర్ర చందనం స్మగ్లర్‌ గా బన్నీ కనిపించబోతున్నట్లుగా ఫస్ట్‌ లుక్‌ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

ఆమద్య కాలంలో ఎర్ర చందనం స్మగ్లింగ్‌ కు సంబంధించిన వార్తలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. శేషాచలం అడవుల్లో తమిళనాడుకు చెందిన కూలీలు ఎర్ర చందనం చెట్లను నరుకుతున్న సమయంలో ఎన్‌ కౌంటర్‌ చేయడం జరిగింది. అసలు వాళ్లను ఏమీ చేయలేని పోలీసులు కూలీలపై తమ ప్రతాపం చూపించారంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. మరి పుష్ప చిత్రంలో ఎర్ర చందనం దుంగలను కొట్టే కూలీలను ఎలా చూపిస్తారు అనే విషయమై ఆసక్తి నెలకొంది.

బతుకుదెరువు కోసం కూలీలుగా మారిన వారి విషయంలో మానవత దృక్పదంతో వ్యవహరించాంటూ తమిళనాడు జనాలు ఆమద్య ఆందళనలు కూడా చేయడం జరిగింది. ఏపీ పోలీసుల తీరుపై ఆమద్య విమర్శలు వచ్చాయి. మరి పుష్ప చిత్రంలో ఏపీ పోలీసులను ఎలా చూపిస్తారు ఎర్ర చందనం కూలీలను సుకుమార్‌ ఏ విధంగా చిత్రీకరిస్తాడు అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.