Begin typing your search above and press return to search.

నాకు తెలిసి సాయిపల్లవి .. లేడీ పవన్ కల్యాణ్: సుకుమార్

By:  Tupaki Desk   |   28 Feb 2022 2:56 AM GMT
నాకు తెలిసి సాయిపల్లవి .. లేడీ పవన్ కల్యాణ్: సుకుమార్
X
'శర్వానంద్ - రష్మిక కాంబినేషన్లో రూపొందిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా మార్చి 4వ తేదీన విడుదల కానుంది. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా, ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ ఫంక్షన్ కి సుకుమార్ .. సాయిపల్లవి .. కీర్తి సురేశ్ ముఖ్య అథితులుగా వచ్చారు. ఈ వేదికపై సుకుమార్ మాట్లాడుతూ .. "ఈ వేడుకలో సమంత మిస్ అయింది. తనతో పాటు రష్మిక .. కీర్తి సురేశ్ .. సాయిపల్లవి ఈ ముగ్గురూ కూడా బ్యూటిఫుల్ .. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్న హీరోయిన్స్.

శ్రీవల్లి రష్మిక గురించి .. 'మహానటి' కీర్తి సురేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. సాయిపల్లవి విషయానికి వచ్చేసరికి అని సుకుమార్ అనగానే, ఆడిటోరియంలో అరుపులు .. కేరింతలు. దాంతో సుకుమార్ మాట్లాడకుండా ఉండిపోయాడు. అప్పుడు ఆయన చెవిలో సాయిపల్లవి ఏదో చెప్పింది. దానికి సుకుమార్ .. "నా చెవిలో సాయిపల్లవి ఏం చెప్పిందో తెలుసా? తన గురించి చెప్పేదేమైనా ఉంటే తనతోనే చెప్పమని అంటోంది. ఈ ఫ్యాన్స్ ను చూస్తుంటే ఆమె లేడీ పవన్ కల్యాణ్ అనిపిస్తోంది.

తన గురించి ఎప్పుడు మాట్లాడదామన్నా కుదరలేదు. ఆమె మంచి ఆర్టిస్ట్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఒక యాడ్ ను రిజక్ట్ చేసే విషయంలో ఆమె అందరికీ గుర్తుండిపోతుంది. పర్సనల్ గా చెబుదామని చెప్పలేకపోయాను. నాకు చాలా బాగా అనిపించింది. అంత హ్యూమన్ బీయింగ్ తో ఉండటం నిజంగా చాలా కష్టమైన విషయం. ఇక సాధారణంగా దేవిశ్రీ ప్రసాద్ ఏ సినిమా చూసినా బాగుంటే వెంటనే నాకు కాల్ చేసి చెబుతాడు. దేవి చెప్పినవి నేను బాగా నమ్ముతాను. ఆయన ఏ కరెక్షన్ చెప్పినా వింటాను. కావాలంటే ఒక సీన్ మళ్లీ తీయమన్నా తీస్తాను. ఆయనపై నాకు అంత నమ్మకం.

ఈ సినిమా చూసి దేవి నాకు కాల్ చేశాడు .. డాళింగ్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అదిరిపోయింది అని చెప్పాడు. నేను కూడా చెబుతున్నాను ..  ఫన్ .. ఎమోషన్ తో కొనసాగే ఈ సినిమా చాలా బాగా వచ్చింది. నేను ఇప్పుడే చెబుతున్నాను ఈ సినిమా హిట్ అని .. దేవి చెప్పిన జడ్జిమెంట్ ను బట్టి. కిశోర్ సున్నితమైన మనసున్నవాడు. నాకు ఇష్టమైన డైరెక్టర్. ఈ సినిమా చాలా చాలా పెద్ద సక్సెస్ కావాలి.

శర్వా విషయానికి వస్తే ఆయనకి నేను పెద్ద ఫ్యాన్ ను. ఆయనను గత రెండు సినిమాల్లో చాలా సీరియస్ గా చూశాను. ఈ సినిమాలో మళ్లీ గతంలో అలరించిన శర్వాను చూశాను. చాలా చాలా బాగా అనిపించింది. ఆల్రెడీ ఆయన సూపర్ హిట్ కొట్టేశాడు. సుధాకర్ గారికి వేరే బిజినెస్ లు ఉన్నప్పటికీ సినిమా మీద ఫ్యాషన్ తో ఆయన పనిచేస్తున్నారు. ఖుష్బూ గారితో పాటు ఈ సినిమాకి పనిచేసిన వాళ్లదరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను" అంటూ సెలవు తీసుకున్నాడు.