Begin typing your search above and press return to search.

నార్త్ ఆడియ‌న్స్ కోసం సుక్కు మాస్ట‌ర్ ప్లాన్

By:  Tupaki Desk   |   13 Jan 2022 6:01 AM GMT
నార్త్ ఆడియ‌న్స్ కోసం సుక్కు మాస్ట‌ర్ ప్లాన్
X
పాన్ ఇండియా స్థాయిలో ఇప్పుడు ఎక్క‌డ విన్నా ఒక‌టే చ‌ర్చ `పుష్ప‌`. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన `పుష్ప ది రైజ్‌` ఊహించ‌ని స్థాయిలో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. బ‌న్నీ - సుక్కుల కాంబినేష‌న్ లో ముచ్చ‌ట‌గా మూడ‌వ సినిమా ఇది. ఈ చిత్రంతో ఇద్ద‌రు పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఉత్త‌రాదిలో ఈ మూవీ ఊహ‌ల‌కు అంద‌ని స్థాయిలో వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తూ ట్రేడ్ పండితుల్నే ఆలోచ‌న‌లో ప‌డేస్తోంది.

ఇప్ప‌టికే వ‌సూళ్ల ప‌రంగా 300 కోట్ల మార్కుని దాటి స్ట‌డీగా దూసుకుపోతున్న `పుష్ప‌` ఓటీటీలోనూ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఇటీవ‌లే ఈ మూవీ ఓటీటీలో విడుద‌లైంది. అక్క‌డ కూడా ర‌చ్చ చేస్తోంది. హిందీ మిన‌హా తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతున్నా థియేట‌ర్ల‌లో `పుష్ప‌` జోరు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. లార్జ‌ర్‌దెన్ లైఫ్ సినిమా కావ‌డంతో ఈ మూవీని ఓటీటీలో కంటే ప్రేక్ష‌కులు అత్య‌ధిక భాగం థియేట‌ర్ల‌లో చూడ‌టానికే ఇష్ట‌ప‌డుతున్నారు. దీంతో థియేట‌ర్ల‌లో `పుష్ప‌` ఇప్ప‌టికీ త‌గ్గేదే లే అన్న‌ట్టుగా దూసుకుపోతోంది.

బ‌న్నీ అభిమానులే కాకుండా సినీ ప్రియులు కూడా ఈ మూవీని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. బ‌న్నీ గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా ఊర మాస్ పాత్ర‌లో న‌టించ‌డం.. విభిన్న‌మైన మేన‌రిజ‌మ్స్ ని, బాడీ లాంగ్వేజ్ ని ప‌లికించిన తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. దీంతో `పుష్ప‌` పై రోజు రోజుకీ క్రేజ్ పెరుగుతుందే కానీ త‌గ్గ‌డం లేదు. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న విజ‌యం సాధించిన ఈ మూవీ ఉత్త‌రాదిలో షాకింగ్ రిజ‌ల్ట్ ని అందించ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోనే కాకుండా ఈ మూవీ సాధిస్తున్న విజ‌యం, వ‌సూళ్ల‌పై మేక‌ర్స్ కూడా చ‌ర్చించుకుంటున్నార‌ట‌.

దీంతో పార్ట్ 2 విష‌యంలో చాలా మార్పులు చేయాల‌ని, మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. అంతే కాకుండా నార్త్ లో ఈ మూవీ కి ల‌భిస్తున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని అక్క‌డి ప్రేక్ష‌కుల్ని మ‌రింత‌గా ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి ద‌ర్శ‌కుడు సుకుమార్ త‌న ప్లాన్ ని ఛేంజ్ చేయబోతున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇందు కోసం ఏకంగా బాలీవుడ్ స్టార్ల‌ల‌ని `పుష్ప ది రూల్‌` కోసం రంగంలోకి దింపాల‌నుకుంటున్నార‌ట‌. అంతే కాకుండా బాలీవుడ్ స్టార్ ల ఎంట్రీని బ‌ట్టి స్క్రీప్ట్ లో మార్పులు చేయ‌బోతున్నార‌ట‌. ప్ర‌ధానంగా కీల‌క స‌న్నివేశాలు, యాక్ష‌న్ ఘ‌ట్టాల్లో భారీ మార్పులు చేయ‌బోతున్న‌ట్టుగా చెబుతున్నారు.

అలా చేయ‌డం వ‌ల్ల నార్త్ ప్రేక్ష‌కుల్లో పార్ట్ 2కి మ‌రింత క్రేజ్‌ని తీసుకురావ‌చ్చ‌న్న‌ది సుకుమార్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. సుకుమార్ ఆలోచ‌న‌కు మేక‌ర్స్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టుగా చెబుతున్నారు. స్క్రిప్ట్ లో మార్పుల్ని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి పార్ట్ 2 ని మార్చిలో సెట్స్ పైకి తీసుకురావాల‌ని ఇప్ప‌టికే ఏర్పాట్లు మొద‌లుపెట్టార‌ని, ఇందుకు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ త్వ‌రలోనే బయ‌టికి రానుంద‌ని తెలిసింది.