Begin typing your search above and press return to search.

'పుష్ప' 2 పార్ట్స్ కోసం సుక్కూ అండ్ టీమ్ కొత్త ప్లాన్..!

By:  Tupaki Desk   |   20 May 2021 6:46 AM GMT
పుష్ప 2 పార్ట్స్ కోసం సుక్కూ అండ్ టీమ్ కొత్త ప్లాన్..!
X
డైరెక్టర్ సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ''పుష్ప'' చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రొడ్యూసర్స్ దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. స్పాన్ ఉన్న సబ్జెక్ట్ కావడంతో రెండున్నర గంటల్లో చెప్పడం కష్టమని.. రెండు సినిమాలుగా చేయాలని నిర్ణయించుకున్నట్లు మేకర్స్ తెలిపారు. దాదాపు నాలుగు నెలల పాటు జరిపిన చిత్రీకరణలో ఫస్ట్ పార్ట్ కి సంబంధించిన మెజారిటీ భాగం కంప్లీట్ అయింది. అలానే సెకండ్ పార్ట్ కి సంబంధించిన 10 శాతం షూటింగ్ పూర్తయ్యింది. కొవిడ్ నేపథ్యంలో ఈ సినిమా షూట్ నిలిచిపోయింది.

పాండమిక్ కారణంగా దొరికిన ఈ సమయంలో సుక్కూ అండ్ టీమ్ రెండు భాగాలుగా చేసిన స్క్రిప్ట్ లో మరిన్ని మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. ముందుగా రాసుకున్న కథకు ఇప్పుడు అదనంగా కొత్త కంటెంట్ ని యాడ్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు పుష్ప టీమ్ కి ఛాలెంజింగ్ గా మారింది. సుమారు 30-35 నిమిషాల ఎపిసోడ్స్ ని కొత్తగా రాస్తున్నారట. అంతేకాదు రెండు పార్ట్స్ లో రెండు ఐటమ్ సాంగ్స్ ని పెడుతున్నారు. ఫస్ట్ పార్ట్ లో బన్నీ ని స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ గా రగ్గుడ్ లుక్ లో చూపించి.. సెకండ్ పార్ట్ లో ఓ డాన్ గా స్టైలిష్ గా చూపిస్తారని టాక్ నడుస్తోంది.

'పుష్ప' చిత్రాన్ని రెండు పార్ట్స్ గా చేయాలని గత నవంబర్ లో నిర్ణయించుకున్నప్పుడే, నిర్మాతలు దీనికి తగ్గట్టుగా బడ్జెట్ ని కేటాయించుకున్నారు. రెండు భాగాలకు కలిపి దాదాపు రూ.250 కోట్ల‌ వరకు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు. కరోనా పరిస్థితులు అనుకూలిస్తే వీలైనంత త్వరగా ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేయడమే కాకుండా.. సెకండ్ పార్ట్ షూటింగ్ మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. 'పుష్ప-1' చిత్రాన్ని ఈ ఏడాదిలో.. సెకండ్ పార్ట్ 2022లో విడుదల చేయనున్నారు.

కాగా, ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు. ప్రకాష్ రాజ్ - జగపతిబాబు - సునీల్ - అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా.. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా సంస్థలు కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.