Begin typing your search above and press return to search.

ప్లాప్ చిత్రానికి సక్సెస్ మీట్ ప్లాన్ చేస్తున్నారా..?

By:  Tupaki Desk   |   29 Oct 2021 6:06 AM GMT
ప్లాప్ చిత్రానికి సక్సెస్ మీట్ ప్లాన్ చేస్తున్నారా..?
X
ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ''నాట్యం''. నిష్రింకాల ఫిల్మ్స్ బ్యానర్ లో సంధ్య స్వీయ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్లాసికల్ డ్యాన్స్‌ ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో తీసిన ఈ మూవీ ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది. ఓపెనింగ్స్‌ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది.

అయితే 'నాట్యం' సినిమా రిలీజ్ అయి ఇప్పటికి వారం రోజులు గడిచిన తర్వాత చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదే క్రమంలో మీడియా మిత్రులకు కాక్‌ టెయిల్ పార్టీ మరియు డిన్నర్ కూడా ఏర్పాటు చేయనున్నారట. ఈ నేపథ్యంలో సినిమా విడుదలైన ఫస్ట్ వీక్ లో విస్తృతంగా ప్రమోషన్స్ చేయకుండా.. ఇప్పుడు ఇలాంటి ఈవెంట్స్ చేయడం వల్ల ప్రయోజనం ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈ శుక్రవారం కొత్త సినిమా థియేటర్లలోకి రావడం వల్ల 'నాట్యం' మూవీ స్క్రీన్స్ తగ్గిపోయాయి. ఇప్పుడు సినిమాకు ప్రచారం చేసుకోవడం అంటే మరికొంత డబ్బు వృధాగా పోవడమే అని కామెంట్స్ వస్తున్నాయి. సంధ్యా రాజు పారిశ్రామిక నేపథ్యం నుండి వచ్చారు. సినిమా డైనమిక్స్ గురించి తెలియకపోవడం వల్లనే ఇలాంటి ప్లాన్స్ చేస్తున్నారని అంటున్నారు.

'నాట్యం' సినిమా ఫలితం ఎలా ఉన్నా సంధ్యా రాజు నటనకు ప్రశంసలు దక్కాయి. స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ అయిన సంధ్యా రాజు తన అభిన‌యంతో ప్రేక్షకుల్ని మెప్పించింది. అలానే ఫస్ట్ ప్రొడక్షన్ అయినా సరే నిర్మాణంలో రాజీ పడకుండా.. సాంప్రదాయ నాట్యం ప్రాధాన్యతను నిజాయితీగా జనాలకు చెప్పాలనే ప్రయత్నాన్ని అందరూ అభినందించారు. ఇప్పుడు ఈ సక్సెస్ మీట్ కూడా తమ బ్యానర్ ని సంధ్య రాజును ప్రమోట్ చేయడానికే అయ్యుంటుందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

కాగా, 'యూ టర్న్' మలయాళ మాతృకలో నటించిన సంధ్య రాజు.. తెలుగులో ''నాట్యం'' సినిమాతో కొరియోగ్రాఫర్ గా, ప్రొడక్షన్ డిజైనర్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్‌ గా అరంగేట్రం చేశారు. రేవంత్ కొరుకొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. చిరంజీవి - బాల‌కృష్ణ‌ - వెంక‌టేష్‌ - రవితేజ - రామ్ చరణ్ వంటి సినీ ప్రముఖులు ఈ సినిమాకు తమ వంతు సపోర్ట్ అందించారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 'నాట్యం' సినిమా చూసి ప్రశంస‌లు కురిపించిన సంగతి తెలిసిందే.