Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్ మీద దాడి చేయడానికి స్టార్ హీరోలు రెడీ ..!

By:  Tupaki Desk   |   18 Feb 2022 4:33 AM GMT
బాక్సాఫీస్ మీద దాడి చేయడానికి స్టార్ హీరోలు రెడీ ..!
X
కరోనా మహమ్మారి కారణంగా గత కొన్ని నెలలుగా బాక్సాఫీస్ కు దూరంగా ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ అందరూ.. బిగ్ స్క్రీన్స్ పై మెరవడానికి సిద్ధంగా ఉన్నారు. కేసులు తగ్గుముఖం పట్టడం.. సినిమాల విడుదలకు పరిస్థితులు సానుకూలంగా ఉండటంతో.. ఇప్పుడు స్టార్ హీరోలందరూ థియేటర్లలో దండయాత్ర చేయడానికి వస్తున్నారు.

ఫిబ్రవరి చివరి వారం మొదలుకొని సమ్మర్ ఎండింగ్ వరకూ ప్రతీ రెండు వారాలకొక పెద్ద సినిమా చొప్పున రిలీజుకు రెడీ అయ్యాయి. చిరంజీవి - మహేష్ బాబు - ప్రభాస్ - పవన్ కళ్యాణ్ - జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ - అజిత్ - విజయ్ - సూర్య - యష్.. ఇలా దక్షిణాది స్టార్ హీరోలందరూ ఈ సీజన్ లో బాక్సాఫీస్ మీద దాడి చేయబోతున్నారు.

తమిళ హీరో అజిత్ కుమార్ నటించిన ''వలిమై'' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ఫిబ్ర‌వ‌రి 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోనీకపూర్ నిర్మించారు. టాలీవుడ్ యువ హీరో కార్తికేయ ఈ సినిమాలో ప్రతినాయకుడుగా కనిపించనున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ ''భీమ్లా నాయక్''. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 25న తెలుగు హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ''ఈటీ''. బ్యాక్ టూ బ్యాక్ ఓటీటీ రిలీజుల తర్వాత సూర్య నుంచి బిగ్ స్క్రీన్ మీదకు రాబోతున్న ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 10న నాలుగు దక్షిణాది భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సూర్య మొదటిసారి తన పాత్రకు స్వయంగా తెలుగు డబ్బింగ్ చెప్పుకున్న సినిమా ఇది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పీరియాడికల్ లవ్ డ్రామా ''రాధేశ్యామ్''. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ మూవీస్ సంస్థలు నిర్మించాయి. చాలా గ్యాప్ తర్వాత డార్లింగ్ నటించిన ఈ ప్రేమకథా చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

దివంగత పునీత్ రాజ్ కుమార్ చివరి చిత్రం ''జేమ్స్''. అప్పూ జయంతి సందర్భంగా మార్చి 17న ఐదు ప్రధాన భారతీయ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. పునీత్ కన్నుమూయడంతో ఆయన పాత్రకు సోదరుడు శివరాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పారు. చేతన్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శివన్నతో పాటుగా రాఘవేంద్ర రాజ్ కుమార్ అతిథి పాత్రలు పోషించారు. పునీత్ ని స్క్రీన్ మీద చూడటానికి యావత్ సినీ అభిమానులు భావోద్వేగాలతో ఎదురు చూస్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్''. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ను నిర్మించారు. యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆతృతగా వేచి చూస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో మార్చి 25న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ మూవీ ''కేజీయఫ్: చాప్టర్ 2''. ఇది బ్లాక్ బస్టర్ 'కేజేయఫ్' చిత్రానికి కొనసాగింపుగా రాబోతోంది. మొదటి భాగం అంచనాలకు మించి విజయం సాధించడంతో.. ఇప్పుడు సెకండ్ పార్ట్ మీద భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ చిత్రాన్ని తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఏప్రిల్ 14న విడుదల కానుంది.

మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ''ఆచార్య''. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి - అవినాష్ రెడ్డి నిర్మించారు. తండ్రీకొడుకులు తొలిసారిగా పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా కావడంతో.. మెగా ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. వరల్డ్ వైడ్ గా తెలుగు హిందీ భాషల్లో ఏప్రిల్ 29న ఈ మెగా మల్టీస్టారర్ రిలీజ్ అవుతుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ''సర్కారు వారి పాట''. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. హ్యాట్రిక్ విజయాలతో దూకుడు మీదున్న మహేష్ ను వింటేజ్ లుక్ లో ప్రెజెంట్ ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ - జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని నిర్ణయించాయి. ప్రపంచ వ్యాప్తంగా మే 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

కోలీవుడ్ హీరో ఇళయ దళపతి విజయ్ - పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా ''బీస్ట్''. డాక్టర్' ఫేమ్ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సన్ పిక్చర్స్ కళానిధి మారన్ దీనికి నిర్మాత. సమ్మర్ కానుకగా ఏప్రిల్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఆ మధ్య ప్రకటించారు. ఇంకా డేట్ ఫిక్స్ చేయనప్పటికీ.. ఏప్రిల్ 14న లేదా ఏప్రిల్ 29న విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.