Begin typing your search above and press return to search.

దీపావళి తరువాత త్రివిక్రమ్ తో సెట్స్ పైకి మహేశ్!

By:  Tupaki Desk   |   23 Sep 2021 3:45 AM GMT
దీపావళి తరువాత త్రివిక్రమ్ తో సెట్స్ పైకి మహేశ్!
X
మహేశ్ బాబు అభిమానులంతా ఆయన తాజా చిత్రమైన 'సర్కారువారి పాట' విడుదల తేదీ కోసం ఎంత ఆసక్తితో ఎదురుచూస్తున్నారో, ఆయన త్రివిక్రమ్ తో చేయనున్న సినిమా కోసం కూడా అంతేలా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మహేశ్ బాబు .. పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' చేస్తున్నాడు. ఒక భారీ స్కామ్ చుట్టూ వినోదభరితంగా తిరిగే ఈ సినిమా సగానికి పైగా చిత్రీకరణను పూర్తి చేసుకుందట. 'సంక్రాంతి' కానుకగా జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నామని ముందుగానే చెప్పడం వలన, ఆ దిశగానే చకచకా పనులు జరుగుతున్నాయి.

ఈ సినిమా పూర్తిచేసిన వెంటనే త్రివిక్రమ్ తో కలిసి మహేశ్ బాబు సెట్స్ పైకి వెళ్లనున్నాడు. త్రివిక్రమ్ తో మహేశ్ బాబు చేస్తున్న మూడో సినిమా ఇది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'అతడు' భారీ విజయాన్ని అందుకుంది. ఇక 'ఖలేజా' సినిమా టీవీలో ప్రసారమైతే ఇప్పటికీ మంచి రేటింగ్ వస్తోంది. మహేశ్ బాబు తన సినిమా కథల విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటాడు. కథలో ఏ పాత్ర ఎక్కడ ఏం చేస్తుంది? ఆ పాత్ర ప్రయోజనం ఏమిటి? దాని ముగింపు ఏమిటి? అనే విషయాల్లో పూర్తి క్లారిటీ వస్తేనే తప్ప ఆయన సెట్స్ పైకి వెళ్లడు.

ఇక మహేశ్ బాబుకు మరో అలవాటు ఉంది. ఒకసారి తనకి హిట్ ఇచ్చిన దర్శకులపై ఆయన పూర్తి నమ్మకం పెట్టేస్తాడు .. వెంట వెంటనే వాళ్లతో సినిమాలు చేయడానికి ఆసక్తిని కనబరుస్తాడు. ఆయన కెరియర్ ను పరిశీలిస్తే ఈ విషయం మనకి అర్థమవుతుంది. అలా ఆయన మరోసారి త్రివిక్రమ్ తో కలిసి పనిచేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగును నవంబర్లో .. అంటే దీపావళి తరువాత మొదలు పెట్టనున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా ఒక పాట చిత్రీకరణతో షూటింగును మొదలుపెడతారట.

ఆ తరువాత ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను కూడా చిత్రీకరించనున్నారని అంటున్నారు. రామ్ - లక్ష్మణ్ ఈ యాక్షన్ ఎపిసోడ్ ను డిజైన్ చేశారని అంటున్నారు. ఇక ఆ తరువాత నుంచి ఈ సినిమా షూటింగు చాలా వేగంగా జరగనుందని చెబుతున్నారు. ఈ సినిమాలో ఒక కథానాయికగా పూజ హెగ్డే పేరు వినిపిస్తోంది. మరో కథానాయికకు కూడా కథలో చోటుకి ఉందని అంటున్నారు. ఇక కథానాయకుడి ఆశయానికి అడ్డుపడే పొలిటికల్ లీడర్ గా .. ప్రతినాయకుడిగా సంజయ్ దత్ కనిపించనున్నాడని చెబుతున్నారు. 'అరవింద సమేత' .. 'అల వైకుంఠపురములో' వంటి భారీ హిట్ల తరువాత త్రివిక్రమ్ చేయనున్న సినిమా కావడంతో, సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.