Begin typing your search above and press return to search.

'శ్రీవల్లి' పాట: పుష్పరాజ్ పాడుకునే సోల్ ఫుల్ మెలోడీ..!

By:  Tupaki Desk   |   13 Oct 2021 6:22 AM GMT
శ్రీవల్లి పాట: పుష్పరాజ్ పాడుకునే సోల్ ఫుల్ మెలోడీ..!
X
అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ''పుష్ప''. ఇందులో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్.. గ్రామీణ యువతి శ్రీవల్లి పాత్రలో రష్మిక కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - స్పెషల్ పోస్టర్స్ - టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అలానే కొద్ది రోజుల క్రితం వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘దాక్కో దాక్కో మేక’ పాట ఓ రేంజ్ లో అదరగొట్టింది. ఈ క్రమంలో 'శ్రీవల్లి' అనే సెకండ్ సింగిల్ లిరికల్ వీడియోని దసరా కానుకగా ఈరోజు బుధవారం ఐదు భాషల్లో రిలీజ్ చేశారు.

'చూపే బంగారమాయనే.. శ్రీవల్లీ.. మాటే మణిక్యమాయనే..' అంటూ వచ్చిన ప్రోమో పూర్తి సాంగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూసేలా చేసింది. 'నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండూ తిప్పేస్తావే.. నీ చూపుల పైనే రెప్పలు వేసి కప్పేస్తావే..' అంటూ సాగిన శ్రీవల్లి పాట శ్రోతలను విశేషంగా అలరిస్తోంది. శ్రీవల్లి ప్రేమలో పడిన పుష్పరాజ్.. ఆమె వెంట పడే సందర్భంలో ఈ పాట పాడుకుంటున్నాడు. 'కనిపించని దేవున్నే కన్నార్పగా చూస్తావే.. కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే..' అంటూ ఎంత తిరిగినా తనవైపు చూడటం లేదనే విషయాన్ని తెలియజేస్తున్నాడు.

'శ్రీవల్లి' పాటకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ వినసొంపైన బాణీలు సమకూర్చారు. మ్యూజిక్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ తన వాయిస్ తో మరోసారి మ్యాజిక్ చేశారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్సన్స్ లో ఈ గీతాన్ని సిద్ శ్రీరామ్ పాడగా.. హిందీలో మాత్రం యువ గాయకుడు జావేద్ అలీ ఆలపించారు. తెలుగు వెర్సన్ కు ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ అందమైన సాహిత్యం అందించారు. ఈ పాటకు శోభి - జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఇందులో అల్లు అర్జున్ వేసిన సింపుల్ స్టెప్స్ బాగున్నాయి. ముఖ్యంగా బన్నీ చెప్పులు జారీపోతే మళ్ళీ తొడుకొని వేసే డ్యాన్స్ ఆకట్టుకుంటోంది. అలానే అల్లు అర్జున్ - రష్మిక ఇద్దరూ డీ గ్లామర్ లుక్ లో అలరిస్తున్నారు.

బన్నీ - సుకుమార్ - దేవి శ్రీ ప్రసాద్ కాంబో అంటేనే అభిమానుల్లో అంచనాలు మరో స్థాయిలో ఉంటాయి. వీరి కలయికలో వచ్చిన ‘ఆర్య’ ‘ఆర్య-2’ సినిమాలు మ్యూజికల్ గా సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు 'పుష్ప' సినిమాకు డీఎస్పీ అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చారని తెలుస్తోంది. ఇది ఈ సినిమాకు మ్యూజిక్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. టీజర్ లో దేవిశ్రీ బ్యాగ్రౌండ్ స్కోర్ కు మంచి రెస్పాన్స్ రాగా.. 'దాక్కో దాక్కో మేక' తో పాటుగా తాజాగా వచ్చిన 'శ్రీవళ్లి' పాటలకు కూడా అనూహ్య స్పందన వస్తోంది.

'పుష్ప' చిత్రానికి మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ చేయగా.. ఆస్కార్ అవార్డ్ గ్రహీత రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ముత్యంశెట్టి మీడియా వారు దీనికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని ''పుష్ప: ది రైజ్'' పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్ని పాన్ ఇండియా స్థాయిలో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.