Begin typing your search above and press return to search.

బిగ్ స్క్రీన్ పై బిగ్ క్లాష్: లెజెండ్ కు 'లైగర్' టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్..!

By:  Tupaki Desk   |   30 Jun 2022 5:09 AM GMT
బిగ్ స్క్రీన్ పై బిగ్ క్లాష్: లెజెండ్ కు లైగర్ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్..!
X
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ సెన్సేషనల్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ''లైగర్''. 'సాలా క్రాస్ బ్రీడ్' అనేది దీనికి ట్యాగ్ లైన్. ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఈ సినిమాతో మొట్ట మొదటిసారిగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించబోతున్నారనే సంగతి తెలిసిందే.

నేడు లెజండరీ బాక్సర్ మైక్ టైసన్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రత్యేకమైన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. నిర్మాత కరణ్ జోహార్ నుండి మొదలుకొని విజయ్ దేవరకొండ - ఛార్మీ కౌర్ - విష్ణు - అనన్య పాండే మరియు పూరీ జగన్నాధ్ ఈ వీడియో ద్వారా టైసన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.

అంతేకాదు, 'లైగర్' సినిమా యుఎస్ఏ షెడ్యూల్ కు సంబంధించిన మేకింగ్ విజువల్స్ ను కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు. మైక్ టైసన్ సింప్లిసిటీ మరియు అతని హంబుల్ యాటిట్యూట్ ను ఈ వీడియోలో గమనించవచ్చు. అక్కడ బాక్సింగ్ దిగ్గజం టీమ్ అందరితో కలిసి ఎంతో ఉల్లాసంగా కనిపించాడు.

అలానే విజయ్ దేవరకొండ ను గట్టిగా కౌగిలించుకుని.. ఆపై అతని బుగ్గలపై ముద్దుపెట్టుకున్నాడు మైక్. ఇది విజయ్ మరియు ఇతరులతో టైసన్ పంచుకున్న అనుబంధాన్ని చూపుతుంది. బిగ్ స్క్రీన్స్ పై బిగ్ క్లాష్ ని చూడటానికి వేచి ఉండండని చిత్ర యూనిట్ పేర్కొంది. మరి లైగర్ - లెజెండరీ బాక్సర్ కలిసి ఏ స్థాయిలో అగ్గి రాజేస్తారో చూడాలి.

కాగా, 'లైగర్' సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయికగా కనిపించనుంది. ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించగా.. రోనిత్ రాయ్ - విష్ణు రెడ్డి - అలీ - మకరంద్ దేశ్ పాండే - గెటప్ శ్రీను తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

పూరీ కనెక్ట్స్ మరియు బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ కలసి సంయుక్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పూరి జగన్నాధ్ - ఛార్మీ కౌర్ - కరణ్ జోహార్ మరియు అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయగా.. థాయ్లాండ్ కు చెందిన కెచా స్టంట్ డైరెక్టర్ గా చేశారు. జానీ షేక్ బాషా ఆర్ట్ డైరెక్టర్ గా.. జునైద్ సిద్ధిఖీ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

లైగర్' అనేది విజయ్ మరియు పూరీ జగన్నాథ్ లకు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.