Begin typing your search above and press return to search.

ఇది 'మా' దురదృష్టం

By:  Tupaki Desk   |   3 Jan 2020 10:25 AM GMT
ఇది మా దురదృష్టం
X
'మా' డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో జరిగిన రచ్చ గత కొన్ని రోజులుగా ఉన్న వివాదాన్ని విభేదాలను కళ్లకు కట్టినట్లుగా చూపించాయి. రాజశేఖర్‌ బాహాటంగా గెస్ట్‌ ల ముందు మీడియా సమక్షంలో మా లో విభేదాలు ఉన్నాయని.. కొందరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంపై చిరంజీవి మోహన్‌ బాబు మరియు కృష్ణంరాజు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏమైనా సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి లేదంటే కూర్చుని మాట్లాడాలి. కాని ఒక కార్యక్రమంలో ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ రాజశేఖర్‌ పై పెద్దలు మండి పడ్డారు.

ఈ విషయమై మాజీ మా అధ్యక్షుడు శివాజీ రాజా స్పందించాడు. మా కార్యక్రమంలో నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరం. చిరంజీవి.. కృష్ణంరాజు.. మోహన్‌ బాబు వంటి పెద్దలు ఉన్న సమయంలో అలా కార్యక్రమంలో జరగడాన్ని ఎవరు కూడా సమర్ధించరు. దీనిపై మా అధ్యక్షుడు నరేష్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి. పెద్దలను పిలిచిన సమయంలో సభను సక్రమంగా సాగేలా చూడటం అధ్యక్షుడి బాధ్యత. ఆ విషయాన్ని కూడా నరేష్‌ సక్రమంగా చేయలేక పోయారు. గతంలో మేము చేసిన పనులపై నిందలు వేసి విమర్శలు చేశారు. ఆ లెక్కలు తేలిన తర్వాత ఆయన చేసిన విమర్శలకు కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు.

తాను వ్యక్తిగతంగా ఎవరిని దూషించాలని అనుకోవడం లేదు. కాని మా లోని ప్రతి ఒక్కరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాజశేఖర్‌ గారు చాలా ఎమోషనల్‌ గా ఉంటారు. ఆయన 10 లక్షల రూపాయలను మా కు విరాళంగా ఇచ్చి కూడా చాలా సైలెంట్‌ గానే ఉన్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేష్‌ గారు ఎంత ఫండ్‌ తీసుకు వచ్చారో చెప్పాలి. విరాళాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్న వద్దని కాలితో తన్నే పరిస్థితి ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

మా కు ఇంతటి దురదృష్టకర పరిస్థితి వస్తుందని ఊహించలేదు అన్నాడు. గతంలో అధ్యక్షుడిగా శివాజీ రాజా చేయగా గత ఏడాది జరిగిన ఎన్నికల్లో శివాజీ రాజా పై నరేష్‌ గెలిచి అధ్యక్షుడిగా అయ్యాడు. అప్పటి నుండి కూడా ఏదో ఒక వివాదం రాజుకుంటూనే ఉంది. మా లో కీలక పదవిని నిర్వహిస్తున్న రాజశేఖర్‌ మొదటి నుండి కూడా నరేష్‌ తీరుపై వ్యతిరేకంగా ఉన్నాడు. అది కాస్త ఇటీవల డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో బయట పడింది.