Begin typing your search above and press return to search.

రీమేకుల‌ని క్యాష్ చేసుకుంటున్న ప్రముఖ నిర్మాణ సంస్థ..!

By:  Tupaki Desk   |   8 July 2021 10:30 AM GMT
రీమేకుల‌ని క్యాష్ చేసుకుంటున్న ప్రముఖ నిర్మాణ సంస్థ..!
X
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' అధినేత రాధాకృష్ణ (చినబాబు).. దాని అనుబంధ సంస్థగా 'సితార ఎంటర్టైన్మెంట్స్' సంస్థను స్థాపించారు. యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ ప్రొడక్షన్ హౌస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసే సినిమాలు ఒక బ్యానర్ లో.. మిగతా సినిమాలన్నీ మరో బ్యానర్ మీద నిర్మిస్తూ వస్తున్నారు. ఓవైపు స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూనే మరోవైపు ఎప్పటికప్పుడు ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ ని పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలో వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ మంచి అభిరుచి గల నిర్మాతలు అనిపించుకున్నారు. అయితే ఇప్పుడు రెండు రీమేక్ సినిమాలతో సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు వస్తున్నారు.

మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' చిత్రాన్ని సితార బ్యానర్ పై తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి ఇందులో హీరోలుగా నటిస్తున్నారు. సాగర్ కె.చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించడంతో పాటుగా దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే సగ భాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని కరోనా సెకండ్ వేవ్ తర్వాత వచ్చే వారం తిరిగి ప్రారంభించనున్నారు. 'ఏకే' రీమేక్ తో టాక్ ఆఫ్ ది టౌన్ అయిన సితార బ్యాన‌ర్.. ఇప్పుడు మలయాళంలో ఘన విజయం సాధించిన ''కప్పెల'' చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు.

'గుంటూరు టాకీస్' ఫేమ్ సిద్ధు జొన్నల గడ్డ - 'మాస్టర్' ఫేమ్ అర్జున్‌ దాస్‌ ప్రధాన పాత్రల్లో ''కప్పేల'' తెలుగు రీమేక్‌ తెరకెక్కనుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథలో అనేక ట్విస్టులు ఉండబోతున్నాయని తెలుస్తోంది. దీనికి 'బుట్ట‌బొమ్మ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాతో శారి చంద్రశేఖర్‌ అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. స్వీకర్‌ అగస్తి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి వంశీ పచ్చి పులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదుగా పూజా కార్యక్రమాలతో బుధవారం ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆగస్ట్ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్ అవుతుంది. సితార టీమ్ కి ఈ రెండు రీమేక్ లు ఎలాంటి విజయాలను అందిస్తాయో చూడాలి.

కాగా, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఇప్పటి వరకు నాగచైతన్య హీరోగా 'ప్రేమమ్' - 'శైలజా రెడ్డి అల్లుడు'.. సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ తో 'బాబు బంగారం'.. నితిన్ తో 'భీష్మ' - 'రంగ్ దే'.. నాని హీరోగా 'జెర్సీ'.. శర్వానంద్ తో 'రణరంగం' వంటి సినిమాలు రూపొందించారు. ఇక వీరు నిర్మించిన 'జెర్సీ' చిత్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ చేస్తున్నారు. దీనికి సితార ఎంటర్టైన్మెంట్స్ వారు సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. అలానే సిద్ధు జొన్నలగడ్డ హీరోగా 'నరుడి బ్రతుకు నటన' అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నారు. దీని ద్వారా విమల్ కృష్ణ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇదే క్రమంలో యువ హీరో నాగ‌శౌర్య హీరోగా లక్ష్మీ సౌజన్య ను డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ 'వరుడు కావలెను' అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇలా వరుస ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతూ సితార టీమ్ ఫుల్ రైజింగ్ లో ఉందని చెప్పవచ్చు.